మోదీ-షా రాంగ్ టర్న్..!!
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ కార్యాలయం కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటిపేరు (Modi Surname) వ్యవహారంలో ఆయనను సూరత్ న్యాయస్థానం దోషిగా తేల్చిన నేపథ్యంలో లోక్ సభ సెక్రెటేరియట్ ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1) (ఈ), ప్రజా ప్రతినిధుల చట్టం 1951లోని సెక్షన్ 8 ఆధారంగా ఆయనపై అనర్హత వేటు వేసినట్లు వివరించింది.
మోదీ ఇంటిపేరు వ్యవహారంలో సూరత్ న్యాయస్థానంలో రాహుల్ గాంధీకి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. జైలు శిక్షను ఎదుర్కొంటోన్న పార్లమెంట్ సభ్యుడిపై- రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1) (ఈ), ప్రజా ప్రతినిధుల చట్టం 1951లోని సెక్షన్ 8 కింద అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది. దాన్ని అనుసరించింది లోక్ సభ సెక్రెటేరియట్. ఈ చర్యపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడిన గౌతమ్ అదాని గురించి ప్రశ్నించినందుకే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని ధ్వజమెత్తాయి. అదాని కుంభకోణాన్ని కాంగ్రెస్ పార్టీ బయటపెట్టిన తరువాత పార్లమెంట్ కు ముఖం చూపించే పరిస్థితి ప్రధాని మోదీకి గానీ, బీజేపీ నాయకులకు గానీ లేదని అన్నారు. అందుకే ఇలా రాజకీయంగా కక్షసాధింపు చర్యలను తీసుకున్నారని విమర్శించారు. ఈ అంశం- దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసింది. రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్షాలన్నీ గొంతెత్తాయి.

ఈ విషయంలో తమ మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలను పక్కన పెట్టాయి. ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ- వాటన్నింటినీ విస్మరించి ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందంటూ భారత్ రాష్ట్ర సమతి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారంటే- దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
బీఆర్ఎస్ సహా, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐ, సీపీఎం, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), జనతాదళ్ (సెక్యులర్), రాష్ట్రీయ జనతాదళ్.. ఇలా ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ఈ విషయంలో ఏకతాటిపైకి వచ్చాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని తప్ప పడుతున్నాయి. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజుగా అభివర్ణిస్తోన్నాయి. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం మోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ఠగా పేర్కొంది బీఆర్ఎస్.
పార్టీల మధ్య ఉండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలంటూ పిలుపునిచ్చింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం తనకు పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదని, జేడీఎస్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యానించారు. దేశాన్ని నాశనం చేయాలనుకునే వారు బీజేపీలోనే ఉంటారని, దేశాన్ని రక్షించాలనుకునే వారు బీజేపీని వీడాలంటూ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. అనర్హత వేటును ఉపసంహరించుకోవాలంటూ డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications