అయ్యప్ప భక్తులకు GOOD NEWS.. బంగారు లాకెట్ల పంపిణీ ప్రారంభం.. తొలి లాకెట్ ఏపీకే
పంగుని ఆరాట్టు, చితిరై విషు సందర్భంగా అయ్యప్ప భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. విషు పండగ సందర్భంగా శబరిమల బంగారు లాకెట్ల పంపిణీని ప్రారంభించింది. శబరిమల ఆలయం గర్భగుడిలో ఉంచి పూజించిన గోల్డ్ లాకెట్ల పంపిణీని దేవస్థానం మంత్రి వీ.ఎన్. వాసవన్, ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన భక్తునికి తొలి లాకెట్ ను అందజేశారు.
1980లో తొలిసారిగా అయ్యప్ప స్వామి బంగారు లాకెట్లను వినియోగంలోకి తీసుకొచ్చారు శబరిమల ట్రావెన్ కోర్ సంస్థానం బోర్డు అధికారులు. 2011-2012 సీజన్ వరకూ అమ్మకాలు కొనసాగాయి. అయితే ఇదే చివరి సారి. ఆ తరువాత దీని విక్రయాలను నిలిపివేశారు. అప్పట్లో ఒక్కో గోల్డ్ ప్లేటెడ్ లాకెట్ 500 రూపాయలు. ఒకవైపు అయ్యప్ప స్వామి, మరో వైపు గణేషుడి బొమ్మలు ముద్రించివుండేవి.
అయితే తాజాగా అయ్యప్ప లాకెట్లను 2 గ్రాములు, 4 గ్రాములు, 8 గ్రాముల సైజుల్లో తయారు చేసినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఓ ప్రకటనలో వివరించింది. 2 గ్రాముల బంగారు లాకెట్ ధర రూ. 19,300గా నిర్ణయించింది. 4 గ్రాముల బంగారు లాకెట్ ధర రూ.38,600గా, 8 గ్రాముల బంగార లాకెట్ ధర రూ. 77,200గా పేర్కొంది. ఆసక్తి ఉన్న భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని పేర్కొంది.

ఈ బంగారు లాకెట్లను రెండు విధాలుగా పొందవచ్చని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఒకటి ఆన్ లైన్ ద్వారా.. WWW.sabarimalaonline.org అనే అధికారిక సైట్ సంప్రదించి గోల్డెన్ లాకెట్ పొందొచ్చు. లేదా శబరిమల ప్రాంతంలోని ట్రావెన్ కోర్ దేవస్థానం పరిపాలనా కార్యాలయంలో డబ్బులు కట్టి పొందవచ్చని తెలిపింది. ఇక ఈ బంగారు లాకెట్స్ తయారీ బాధ్యతలను తమిళనాడుకు చెందిన జీఆర్ టీ జ్యూవెలర్స్, కేరళకు చెందిన కల్యాణ్ జ్యువెలర్స్ దక్కించుకున్నాయి.












Click it and Unblock the Notifications