పార్టీలో పాట పాడలేదని డీజేని కాల్చి చంపేశారు
లక్నో: పుట్టిన రోజు సందర్బంగా నచ్చిన పాట పాడలేదని ఆరోపిస్తూ డీజే (డిస్కో జాకీ)ని అతి దారుణంగా రివాల్వర్ తో కాల్చి చంపిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. రాయ్ బరేలీ లోని మీర్ గంజ్ సమీపంలోని సిదౌలి ప్రాంతంలో సోమవారం రాత్రి డీజే హత్యకు గురైనాడు.
డీజే అరుణ్ వాల్మీకి (30) పాటలకు ఉత్తరప్రదేశ్ లోని పలు జిల్లాలలో మంచి డిమాండ్ ఉంది. పలు శుభకార్యాలలో అరుణ్ వాల్మీకి పాటలు పాడుతుంటాడు. సిదౌలి ప్రాంతంలో నివాసం ఉంటున్న బంగారు నగల వ్యాపారి హరి ఓం గుప్తా మనుమరాలి పుట్టిన రోజు వేడుకలు సోమవారం జరిగాయి.
సోమవారం రాత్రి డీజే అరుణ్ వాల్మీకి బర్త్ డే పార్టీలో పాటలు పాడుతున్నాడు. ఆ సందర్బంలో బర్త్ డే వేడుకలకు హాజరైన అశు అలియాస్ ఐస్ అనే యువకుడు తనకు నచ్చిన పాట పాడాలని చెప్పాడు. మీరు చెప్పిన పాటలు నేను పాడలేను అని అరుణ్ అన్నాడు.
ఆ సందర్బంలో వాదనకు దిగిన అశు సహనం కోల్పోయి జేబులో ఉన్న రివాల్వర్ తీసుకుని విచక్షణారహితంగా అరుణ్ వాల్మీకి మీద కాల్పులు జరిపాడు. బుల్లెట్లు దూసుకు వెళ్లడంతో డీజే అరుణ్ వాల్మీకి కుప్పకూలిపోయాడు. కాల్పులు జరిపిన అశు అక్కడి నుండి పరారైనాడు.
వెంటనే అరుణ్ వాల్మీకిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించాడని పోలీసులు అన్నారు. అరుణ్ వాల్మీకి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి నిందితుడు అశు కోసం గాలిస్తున్నామని అడిషనల్ పోలీసు కమిషనర్ బ్రిజేష్ శ్రీవత్సవా తెలిపారు.