ముస్లిం విక్రేతల నుంచి కూరగాయాలు కొనొద్దు: బీజేపీ ఎమ్మెల్యే కాంట్రావర్సీ కామెంట్లు, వీడియో..
కరోనా వైరస్ సృష్టిస్తోన్న విలయంతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. వైరస్ దెబ్బకు విలవిలలాడిపోతున్నాడు. ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే తన నోటిదురుసును ప్రదర్శించారు. ముస్లిం విక్రేతల నుంచి కూరగాయాలు కొనొద్దని చేసిన కామెంట్ అగ్గిరాజేసింది. ఈ మేరకు ఎమ్మెల్యే సురేశ్ తివారీ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ముస్లిం విక్రేతల నుంచి నో...
‘ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా వినండి, ఎవరూ కూడా ముస్లిం షాపులో కూరగాయాలు కొనొద్దు. ఎందుకంటే వారినుంచి వైరస్ వ్యాపిస్తోంది అనే అర్థం వచ్చేలా' ఎమ్మెల్యే సురేశ్ తివారీ కోరారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఒక వర్గంపై వివక్ష చూపొద్దని, మనమంతా ఐక్యంగా ఉండి వైరస్ను తరిమికొట్టాలని ప్రధాని మోడీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించిన కొద్దిరోజులకే బీజేపీ ఎమ్మెల్యే నోరుజారడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఒకరు చేసిన తప్పును మతాన్ని నిందించడం సరికాదు అని.. సాయం చేసే సమయంలో వివక్ష చూపొద్దని మోహన్ భగవత్ సూచించిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి.
ఈ సమయంలో.. ఇలా...
ప్రపంచం విపత్తును ఎదుర్కొంటోంది. ఇదీ మనకు పరీక్ష సమయం... ఇలాంటి సందర్భంో కూడా బీజేపీ నేతలు సమాజంపై తన ద్వేష భావాన్ని వ్యాపింపజేస్తున్నారని మండిపడ్డారు. ఈ చర్యను ప్రజలు తప్పుపడతారు అని, సదరు ఎమ్మెల్యేపై దేశద్రోహం కేసు నమోదు చేసి జైలుకు తరలించాలని ఎస్పీ నేత అనురాగ్ డిమాండ్ చేశారు.
Recommended Video
ఇదివరకు కూడా..
ఇటీవల ఢిల్లీలో కూరగాయాలు విక్రయించే అతనిపై కూడా కొందరు దాడిచేసిన సంగతి తెలిసిందే. పేరు అడిగి దాడి చేశారు. ఆ సమయంలో కొందరు తీసిన వీడియో వైరలవడంతో. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. జంషెడ్ పూర్లో కూడా పండ్ల దుకాణంపై కూడా పోస్టర్ వేసి విశ్వహిందూ పరిషత్ తన నైజాన్ని బయటపెట్టుకుంది. మీరట్ ఆస్పత్రి కూడా ముస్లింలు కరోనా వైరస్ నెగిటివ్ వస్తేనే ట్రీట్మెంట్ ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే కామెంట్ చేశారు. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా సురేశ్ తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.