బీజేపి వ్యతిరేకంగా మమతా బెనర్జీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా..??
తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పడాలని గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ నేతలతో పాటు కాంగ్రేస్ పార్టీ పెద్దలను ఆమె సంప్రదించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో మూడవ కూటమికి తుది మెరుగులు దిద్ది ఎవరి బాద్యతలు వారికి కట్టబెట్టాలని మమత భావిస్తున్నట్టు తెలుస్తోంది.
దేశ వ్యాప్తంగా బీజేపి వ్యతిరేక శక్తుల ఏకీకరణ కోసం మమత బెనర్జీ చురుగ్గా పావులు కదుపుతున్నారు. మమత ఫ్రంట్ను ముందుండి ఎవరు నడిపించాలనే విషయంలో ఏకాభిప్రాయం కోసం ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు థర్డ్ ఫ్రంట్ కు నేత్రుత్వం వహిస్తే సత్వరం ఆశించిన ఫలితాలు వస్తాయనేది ఆమె నమ్మకంగా తెలుస్తోంది.
బీజెపీ ఓటమే లక్ష్యం.. అదే మమత బెనర్జీ ద్యేయం..
2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ చేస్తున్న థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ముందడుగు వేస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియాగాంధీ, మాజీ ప్రధాని దేవెగౌడతో పాటు టీడీపీ, వైసీపీ, డీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీపీ తదితర పార్టీల నేతలతో సమావేశం అయ్యారు. కొన్ని ఎన్డీయే మిత్రపక్షాలతోను మమతా బెనర్జీ భేటీ కానున్నట్లు టీఎంసీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని పదవిపై తనకు ఆసక్తి లేదని, అత్యున్నత రాజకీయ పదవికి తాను ఎవరికీ పోటీ కాదని మమతా తేల్చిచెప్పారు.
మమతా ర్యాలీకి ఉద్దమ్ థాక్రే.. సంచలన నిర్ణయం తీసుకున్న శివసేన..
ఎన్నికల తర్వాత విపక్ష పార్టీల సమిష్టి నిర్ణయంతోనే ప్రధాని అభ్యర్థిపై నిర్ణయిస్తామని అన్నారు. ప్రతిపక్షాల ఐక్యతను చాటేలా వచ్చే ఏడాది జనవరి 19న తాను చేపట్టబోయే మెగా ర్యాలీకి మద్దతుగా రావాలని కోరుతూ వివిధ పక్షాల నేతలను కలిసినట్లు మమత వర్గాలు వెల్లడించాయి. ఇదిలావుండగా, తమతో చేరడానికి ఎన్డీయే మిత్రపక్షం శివసేనను కూడా దాదాపు ఒప్పించినట్లు కనిపిస్తోంది. ఆపార్టీకి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ కూడా మమతతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. దాంతో 2019 జనవరి 19న మమత బెనర్జీ నిర్వహించే భారీ ర్యాలీలో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే పాల్గొననున్నారని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి.
బీజేపి శివసేన మద్య విభేదాలు.. మోదీ విధానాలను వ్యతిరేకిస్తున్న శివ సైనికులు..
కాగా శివసేన గత కొన్ని రోజులుగా బీజేపీ తీరును ఎండగడంతో పాటు ఒక స్థానిక పత్రికలో బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. మిత్రపక్షమైన బీజేపీని గతంలో బహిరంగంగా సమర్థించామని, ఇక బహిరంగంగా వ్యతిరేకిస్తామని ఉద్ధవ్ పేర్కొనడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో శివసేన ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించిన విషయం కూడా తెలిసిందే. దేశంలోని బీజేపీ, కాంగ్రెస్యేతర పార్టీలను కలుపుకొని ఫెడరల్ ఫ్రంట్ పెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ మధ్య జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. కానీ టీడీపీ తెచ్చిన అవిశ్వాసంతో పాల్గొనకుండా టీఆర్ఎస్ పార్టీ తీసుకున్న అడుగులు చూస్తుంటే మాత్రం ఫెడరల్ ఫ్రంట్ 2019 ఎన్నికలకు ముందు సాద్యపడే అంశంగా ఏకోశానా కనిపించడం లేదు.
మమత కూటమికీ కేసీఆర్ సంఘీభావం పై సందేహాలు.. మోదీతో మైత్రీ బంధమే అడ్డంకి..
మమతా బెనర్జీ ఓ అడుగు ముందుకేసి బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా గళం విప్పినా, కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవడం గమనార్హం. ఎన్డీయే ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఈ విషయం బోధపడింది. బీజేపీయేతర పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవటం, ఫ్రంట్ ఏర్పాటుకు ముందుండి నడిపించే నాయకుడు ఎవరు అనేదానిపై స్పష్టత లేకపోవడం వంటి కారణాల వల్ల ఫెడరల్ ఫ్రంట్ ఇప్పట్లో లేనట్లే అనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రాంతీయ పార్టీల మధ్య సఖ్యతలేదనే విషయం ఓటింగ్ సంఖ్యలను బట్టి చూస్తుంటే తెలుస్తోంది. దీంతో కేసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ కు తాత్కాలిక బ్రేకులు పడ్డట్టేననే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో మమత బెనర్జీ మూడోకూటమి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకోవడం దేశరాజకీయాల ద్రుష్టిని ఆకర్శించాయి.