చావు బతుకుల్లో ఉన్నా.. కనికరం లేనితనం: ఆ డ్రైవర్ చేసిన పనికి అతను బలి..
తిరువనంతపురం: కేరళలోని త్రిశూర్లో దారుణం జరిగింది. సాటి మనిషి అన్న కణికరం లేకుండా ఓ అంబులెన్స్ డ్రైవర్ ఓ క్షతగాత్రుడి పట్ల నిర్దయగా వ్యవహరించాడు. అతని నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 20వ తేదీన పాలక్కడ్ జిల్లాలోని కొదక్కడ్ సమీపంలో ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్పై రోడ్డును క్రాస్ చేస్తున్న ఓ వ్యక్తి ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో పాలక్కడ్ లోని ఓ ఆసుపత్రికి అతన్ని తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం త్రిశూర్ తరలించే ఏర్పాట్లు చేశారు.

అంబులెన్స్ లో అతన్ని త్రిశూర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. మార్గమధ్యలో అతను అందులోనే మలమూత్ర విసర్జన చేశాడు. దీంతో అతన్ని కిందకు దించే సమయంలో.. ఆ దుర్గంధాన్ని భరించలేక.. అంబులెన్స్ డ్రైవర్ స్ట్రెచర్ ను సగానికి దించి వదిలేశాడు. దీంతో తలకిందులుగా అయిపోయిన బాధితుడు తీవ్ర నొప్పితో బాధపడ్డాడు.
చివరకు ఆ ఆసుపత్రి సిబ్బంది అతన్ని గమనించి హుటాహుటిన లోపలికి తరలించారు. అనంతరం చికిత్స ప్రారంభించగా.. దురదృష్టవశాత్తు అతను ఈ శనివారం కన్నుమూశాడు.
అంబులెన్స్ డ్రైవర్ ఆ క్షతగాత్రున్ని స్ట్రెచర్పై వదిలేసి వెళ్లిన దృశ్యాలను ఎవరో వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అతని మృతికి కారణమైన అంబులెన్స్ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications