భారత్లో తొలి డ్రోన్ అటాక్: మిలిటరీ బేస్, జమ్మూ ఎయిర్పోర్ట్ వద్ద పేలుళ్లు, దర్యాప్తు ముమ్మరం
జమ్మూ: ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో జమ్మూ విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండు పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి విమానాశ్రయంలోని ఓ భవనం పైకప్పు స్వల్పంగా కూలిపోయినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. డ్రోన్లు ఉపయోగించి దాడులు చేసినట్లు గుర్తించారు. కాగా, డ్రోన్లతో దాడి జరగడం ఇదే కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. ఆదివారం తెల్లవారుజామున కొన్ని డ్రోన్లు తక్కువ ఎత్తులో ఎగురుతూ వచ్చి జమ్మూ వాయుసేన స్థావరంలోని విమానాలు, హెలికాప్టర్లు నిలిచిన హ్యాంగర్ల వద్ద పేలుడు పదార్థాలను జార విడిచాయి. ఈ తర్వాత కొద్ది నిమిషాలకే ఎంఐ 17 హెలికాప్టర్లను, రవాణా విమానాలను భద్రపరిచే చోట పేలుడు పదార్థాలను పడేశాయి. పేలుడు సంభవించినప్పటికీ వీటికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
కాగా, భారత్లో డ్రోన్లను వినియోగించి రక్షణ దళాలపై చేసిన తొలి దాడిగా దీనిని భావిస్తున్నారు. ఈ పేలుళ్లలో ఒక భవనం పైకప్పు భారీగా దెబ్బతింది. పెద్దగా రంధ్రం పడింది. రెండో పేలుడు ఘటన జమ్మూ విమానాశ్రయం బయటి ప్రదేశంలో జరిగింది. కాగా, ఈ డ్రోన్లను రాడార్ గుర్తించకపోవడం గమనార్హం.
Damage caused due to explosions by the drones at the Jammu airbase at 1.27am and 1.32 am today. Initial inputs suggest that shaped charge (explosive device) used for the explosions: Sources pic.twitter.com/53euEdNpfD
— ANI (@ANI) June 27, 2021
సమాచారం అందిన వెంటనే ఫోరెన్సిక్ సిబ్బంది, వాయుసేన బృందం, ఇతర భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విమానాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలపై ఎన్ఐఏ కూడా దర్యాప్తు ప్రారంభించింది. వైఎస్ ఎయిర్ చీఫ్ ఎయిర్ మార్షల్ హెచ్ఎస్ అరోరాతో మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ ఈ ఘటనపై ఆరా తీశారు.