పాకిస్తాన్లో ల్యాండ్ అయిన కేంద్రమంత్రి జైశంకర్: ఏం జరుగుతోంది?
SCO Summit 2024: ప్రతిష్ఠాత్మక షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అత్యున్నత భేటీని ఈ ఏడాది పాకిస్తాన్ నిర్వహిస్తోంది. దీనికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజధాని ఇస్లామాబాద్ వేదికగా బుధవారం ఈ సమ్మిట్కు ఆరంభం కాబోతోంది. ఇది 23వ ఎస్సీఓ అత్యున్నత సమావేశం.
ఇందులో సభ్యత్వం ఉన్న దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు లేదా విదేశాంగ శాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరు కావడం ఆనవాయితీగా వస్తోంది. 2001లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. భారత్, చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది.

ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా.. అబ్జర్వర్ స్టేట్స్ హోదాలో కొనసాగుతున్నాయి. ఆర్మేనియా, అజర్బైజాన్, కాంబోడియా, నేపాల్, శ్రీలంక, టర్కీలకు డైలాగ్ పార్ట్నర్షిప్ ఉంది ఇందులో. సభ్య దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనేది ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం.
గత ఏడాది ఎస్సీఓ భేటీని భారత్ నిర్వహించింది. గోవాలో ఈ సమావేశం ఏర్పాటైంది. అప్పట్లో ఈ ఎస్సీఓ సభ్య దేశాల సమావేశానికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి హాజరైన విషయం తెలిసిందే. కొన్ని సంవత్సరాల విరామం తరువాత పాకిస్తాన్కు చెందిన ఓ అత్యున్నత స్థాయి అధికారి లేదా మంత్రి భారత్లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి.
ఇప్పుడు పాకిస్తాన్ వంతు వచ్చింది. అక్టోబర్లో ఎస్సీఓ సమావేశాన్ని నిర్వహించడానికి ఏర్పాటు సాగిస్తోంది. సభ్య దేశాధినేతలు, ప్రధానమంత్రులకు ఆహ్వానాలను పంపిస్తోంది. ఈ క్రమంలో భారత్కూ ఆహ్వానం అందింది. ఎస్సీఓ భేటీకి హాజరు కావాలంటూ అధికారికంగా ఆహ్వానపత్రాలను పంపించింది.
ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఈ భేటీకి హాజరు కానున్నారు. ఇందులో పాల్గొనడానికి ఆయన పాకిస్తాన్కు చేరుకున్నారు. కొద్దిసేపటి కిందటే రావల్పిండిలోని బెనజీర్ భుట్టో అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. దాదాపుగా 10 సంవత్సరాల తరువాత ఓ భారత విదేశాంగ శాఖ మంత్రి పాకిస్తాన్లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications