రేషన్ లబ్దిదారులకు బిగ్ ఆఫర్- ఇక నుంచి 60 రకాల సరుకులు, ధరలు..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రేషన్ వ్యవస్థలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఇంటి వద్ద డెలివరీ విధానం నిలుపుదల చేసి తిరిగి రేషన్ దుకాణాలను ప్రారంభించారు. అందులో భాగంగా ఇప్పుడు రేషన్ దుకాణాల్లో మినీ మార్ట్లను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చారు. పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించి తొలుత 60 రకాల వస్తువు లను తక్కవ ధరలకే వినియోగదారులకు అందుబాటులోకి ఉంచుతున్నారు.
ఏపీ పౌరసరఫరాల శాఖ సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సామాన్యులకు నాణ్యమైన సరుకులను తక్కువ ధరలకే అందించాలనే ఆశయంతో ప్రవేశపెట్టిన 'మీ మార్ట్' స్టోర్లను తొలుత పైలెట్ ప్రాజెక్టు గా ప్రారంభించారు. రేషన్ డీలర్ల ఆర్థిక స్వావలంబనను పెంపొందించే లక్ష్యంతో 'మీ మార్ట్ (నీది.. నాది.. మనందరిది)' పేరుతో రేషన్ దుకాణాల్లో మినీ మార్ట్లను ప్రారంభిస్తున్న ట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.ప్రజలకు ఒకే చోట నాణ్యమైన నిత్యావసర వస్తువులను అందుబాటు ధరలకు అందించడమే ఈ మార్టుల ప్రధాన ఉద్దేశమన్నారు. వీటిలో 60 రకాల సరుకులతో ప్రారంభించి, రాబోయే రోజుల్లో 250 రకాల నాణ్యమైన సరుకులను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని వివరించారు.

ఒకే చోట 60 రకాల సరుకులు
రేషన్ వ్యవస్థను కేవలం బియ్యం పంపిణీకే పరిమితం చేయకుండా, ప్రజల ముంగిటకే మినీ సూపర్ బజార్లను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు చర్యలు వేగవంతం చేశామన్నారు. ప్రస్తుతం 'మీ మార్ట్' లో నిత్యం అవసరమయ్యే 50 రకాల నాణ్యమైన వస్తువులను అందుబాటులో ఉంచామని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 1,000 'మీ మార్ట్' స్టోర్లను విస్తరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. బహిరంగ మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ దుకాణాల్లో ప్రతి వస్తువుపై ఐదు రూపాయల వరకు తక్కువ ధరకే లభిస్తుందని, దీనివల్ల పేద, మధ్యతరగతి వర్గాలపై ఆర్థిక భారం తగ్గుతుందని వివరించారు. గ్రామీణ స్థాయిలోనూ వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు.













Click it and Unblock the Notifications