తిరుమలలో గదుల దళారీ ముఠా నెట్ వర్క్: కింగ్ పిన్ గుర్తింపు: ఒక్కో రూమ్ పై
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి భక్తులను మోసగిస్తూ రూములు అధిక ధరలకు విక్రయిస్తోన్న దళారీ ముఠా నెట్ వర్క్ ను టీటీడీ విజిలెన్స్ అధికారులు భగ్నం చేశారు. దాని గుట్టురట్టు చేశారు. నకిలీ గుర్తింపు కార్డులతో గదులు పొంది వాటిని సాధారణ భక్తులకు ఎక్కువ రేటుకు అమ్ముతున్న ముఠా ఆట కట్టించారు. సీఆర్వో వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
ఆ నిందితుడిని కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ఆషిక్ అలీ గా గుర్తించారు. ఈ నెల 16వ తేదీన ఇదివరకే ఒక గదిని తీసుకున్న ఆషిక్ అలీ.. మరొక గుర్తింపు కార్డుతో క్యూలైన్ లో నిలబడటాన్ని సీఆర్వో ఉద్యోగులు గుర్తించారు. అనుమానం రావడంతో వెంటనే విజిలెన్స్ విభాగానికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే సీఆర్వో వద్దకు చేరుకున్న విజిలెన్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు నకిలీ ఆధార్ కార్డులు, గది రిజిస్ట్రేషన్ రశీదు, కొంత నగదు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో రంజిత్ అనే ప్రధాన దళారి ఆదేశాల మేరకు తాను ఈ పని చేస్తున్నట్లు ఆషిక్ అలీ అంగీకరించాడు. ఒక్కో గదికి తనకు 1,000 రూపాయలు ఇస్తామన్నారని, నకిలీ గుర్తింపు పత్రాలతో గదులు సంపాదించి వారికి అప్పగించడమే తన బాధ్యతని తెలిపాడు. ఈ ఘటనపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నకిలీ ఆధార్ కార్డుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు విజ్ఞప్తి చేసింది. వసతి గదులు కేవలం భక్తుల సౌకర్యార్థం మాత్రమేనని, ఎలాంటి పరిస్థితుల్లోనూ దళారులను నమ్మి మోసపోవద్దని సూచించింది. ఆధార్ కార్డులు, ఫొటోలు, ఫోన్ నంబర్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వడం వల్ల ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరించింది. గదులను సీఆర్వో కౌంటర్లు, టీటీడీ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని కోరింది.
దళారీలు ఎవరైనా డబ్బులు ఆశ చూపి గదులు ఇప్పిస్తామని సంప్రదించినా లేదా తిరుమలలో అనుమానాస్పద కదలికలు గమనించినా వెంటనే సమాచారం ఇవ్వాలని భక్తులకు సూచించింది. టీటీడీ విజిలెన్స్ కంట్రోల్ రూమ్ నెంబర్ 9866898630 లేదా కాల్ సెంటర్ నెంబర్ 155257 ను సంప్రదించవచ్చనని, భక్తులను మోసగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ తేల్చి చెప్పింది.














Click it and Unblock the Notifications