ఆజంఖాన్పై 72, మేనకాపై 48 గంటల నిషేధం : నోటిదురుసుపై ఈసీ చర్యలు
న్యూఢిల్లీ : ఎన్నికల వేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోన్న నేతలపై ఎన్నికల సంఘం కొరఢా ఝులిపిస్తోంది. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్, మాయావతి ప్రచారానికి కత్తెర వేసినా ఈసీ, తాజాగా ఎస్పీ నేత ఆజంఖాన్, కేంద్రమంత్రి మేనకాగాంధీ ప్రచారానికి కత్తెర వేసింది. తాము నిర్దేశించిన సమయం వరకు వారు ప్రచారం చేయొద్దని తేల్చిచెప్పింది.
నోటిదురుసు ఫలితం
ఆదివారం ఓ సభలో ఆజంఖాన్ తన ప్రత్యర్థి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏకంగా జాతీయ మానవ హక్కుల సంఘం కూడా స్పందించింది. ఈ నేపథ్యంలో ఆయనపై 72 గంటల ప్రచారం నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయని తేల్చిచెప్పింది.
హుంకరించారు .. నోటికి తాళం పడింది
ఇటీవల సుల్తాన్ పూర్ లో ప్రచారం చేసిన మేనకాగాంధీ కూడా తన నోటిదురుసును ప్రదర్శించారు. ముస్లింలు అంతా తనకే ఓటేయాలని హుకుం జారీచేశారు. వారు ఓటేసిన వేయకున్నా ఫరవాలేదని, కానీ తన వద్దకు సాయం కోసం వచ్చినప్పుడు మాత్రం సంగతి చూస్తానని బెదిరించారు. మేనకాగాంధీ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది. దీంతో ఆమెపై ఈసీ చర్యలకు ఉపక్రమించింది. 48 గంటలపాటు ప్రచారంలో పాల్గొనవద్దని ఆదేశాలు జారీచేసింది.
మాయా, యోగిపై కూడా ..
వీరు కాక ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు బీఎస్పీ చీఫ్ మాయావతి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై 48, 72 గంటలు ప్రచారంలో పాల్గొనవద్దని ఇదివరకే ఆదేశాలు జారీచేసింది.