Eknath Shinde Factor: షిండే అంటే "ఫ్లవర్"అనుకొంటివా...కింగ్ మేకర్..!!
Eknath Shinde:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సస్పెన్స్కు తెరపడింది. అత్యంత స్పష్టమైన మెజార్టీతో మహాయుతి కూటమి అధికారం చేపట్టే దిశగా ముందుకు వెళుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే మహాయుతి కూటమి అభ్యర్థులు స్పష్టమైన మెజార్టీతో ముందుకు దూసుకెళ్లారు. దీంతో మహావికాస్ అగాఢీ కూటమికి నిరాశ తప్పలేదు.సాధారణంగా ఏ అధికార పార్టీకైనా సరే.. వ్యతిరేకత ఉండటం సహజం. మహారాష్ట్రలో కూడా అధికారిక మహాయుతి కూటమి ప్రభుత్వంపై కొంతో గొప్పో వ్యతిరేకత ఉంది. అయితే ఈ వ్యతిరేకతను ఏక్నాథ్ షిండే మాయ చేశారు.. అదెలాగో ఇక్కడ చూద్దాం.
మరాఠీ బ్రాండ్ అంబాసిడర్ ఏక్నాథ్ షిండే
ఒక్కటిగా ఉన్న శివసేనలో చీలిక తీసుకురావడంలో ఇటు బీజేపీ అటు ఏక్నాథ్ షిండే సక్సెస్ అయ్యారు. ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రి చేయడం ద్వారా బీజేపీ గూగ్లీ వేసిందనే చెప్పాలి. మరాఠాలకు బ్రాండ్ అంబాసిడర్గా బీజేపీ ఏక్నాథ్ షిండేను ప్రమోట్ చేసింది. అధికారం వస్తే మళ్లీ ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రి అవుతారంటూ ప్రచారం చేసింది. దీంతో మరాఠీలు కూడా సంబరపడ్డారు. ఓ వైపు జరాంజర్ పాటిల్ మరాఠా ఉద్యమం చేస్తున్నందున తమకు కలిసి వస్తుందని మహా వికాస్ అగాఢీ కూటమి భావించింది. కానీ ఇక్కడ పాచిక పారలేదు. ఏక్నాథ్ షిండే మరాఠా గౌరవానికి చిహ్నంగా మారారని సాధారణ మరాఠా ఓటరు భావించారు.ఇది థాక్రే కుటుంబానికి శాపంలా మారింది.

బాలికా శిశు పథకం-సంక్షేమ పథకాలు
బాలికా శిశు పథకం అమలు చేయడం మహాయుతి కూటమికి కలిసొచ్చింది.సీఎం ఏక్నాథ్ షిండే వల్లే తమ ఖాతాలోకి నెల నెలా డబ్బులు వస్తున్నాయని సామాన్యులు భావించారు. మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఇంకాస్త ఎక్కువగా డబ్బులు వస్తాయని అక్కడి సామాన్య ప్రజలు భావించడం కూటమికి కలిసొచ్చింది. మహావికాస్ అగాఢీకి చెందిన ఓటర్లు కూడా మహాయుతి కూటమి వైపు మర్లడం అదనపు బలంగా మారింది.ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొన్ని రోజుల ముందు మహాయుతి కూటమి ప్రభుత్వం టోల్ ప్లాజాలను ఎత్తేసి టోల్ ఫీజులను తొలగించడం ఈ ఎన్నికలపై ప్రభావం చూపిందని చెప్పొచ్చు.
హిందూ-ముస్లింలను సంతృప్తి పరిచారు
"ఏక్ హై తో సాథ్ హై" అనే నినాదంతో ముందుకెళ్లిన మహాయుతి కూటమి ప్రభుత్వం హిందువుల ఓట్లను పోలరైజ్ చేయడంలో సక్సెస్ అయ్యింది.మరోవైపు అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి ముస్లిం అభ్యర్థులను బరిలో నిలపడం ద్వారా ముస్లింలకు కూటమి వ్యతిరేకం కాదనే సంకేతాలను పంపింది.దీంతో ముస్లింలు కూడా మహాయుతి కూటమి వైపు మొగ్గు చూపినట్టు ఫలితాలను చూస్తే అర్థం అవుతోంది.అంతేకాదు ఏక్నాథ్ షిండే ప్రభుత్వం మదర్సా టీచర్ల జీతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో ముస్లింలకు కూటమి వ్యతిరేకం కాదనే సందేశాన్నిచ్చింది.దీంతో ముస్లిం ఓట్లు మహాయుతి కూటమికి విరివిగా పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు.

బీజేపీ కొత్త వ్యూహం
బీజేపీ తొలి నుంచి స్థానిక రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చింది. హర్యానాలో కూడా ఇదే కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ హర్యానా ఎన్నికల ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదు. అక్కడ స్థానిక నేతలకే ఎక్కువ ప్రచార బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్రలో కూడా స్థానిక నేతలకే ప్రచారంలో ప్రాధాన్యత ఇచ్చారు. మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో ర్యాలీలు, బహిరంగ సభలు ఆర్ఎస్ఎస్తో కలిసి డిప్యూటీ సీఎం ఫఢ్నవీస్ నిర్వహించారు.
సంఘ్తో కలసి పనిచేయడం కలిసొచ్చిందా..?
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం ముఖ్యంగా ఫడ్నవీస్ ఆర్ఎస్ఎస్తో కలిసి పనిచేయడం బీజేపీకి కొండంత అండగా మారింది.సంఘ్ కార్యకర్తలు ప్రతి గృహాన్ని ప్రతి తలుపును తట్టి బీజేపీ సందేశాన్ని చేరవేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకుని, అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త వ్యూహాన్ని అమలు చేసింది కమలం పార్టీ.ఇక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కరపత్రాలను ప్రతి ఇంటికి చేరవేశారు. అందులో ల్యాండ్ జీహాద్, లవ్ జిహాద్, మతమార్పిడి, రాళ్లదాడితో కూడిన అల్లర్ల గురించి ప్రస్తావించారు.
ఇలా మొత్తానికి మహారాష్ట్రలో మహాయుతి కూటమి రావడంలో ఏక్నాథ్ షిండే ఫ్యాక్టర్తో పాటు పలు అంశాలు కలిసొచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications