నితీష్కు షాక్, లంచం తీసుకుంటూ దొరికిన మంత్రి
పాట్నా: జెడీయూ అధినేత నితీష్ కుమార్కు మంత్రి రూపంలో షాక్ తగిలింది! బీహార్ మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. దీనికి ఒకరోజు ముందుగా.. రాష్ట్ర పట్టణ, అబ్కారీ శాఖ మంత్రి అవదేశ్ కుశ్వాహా లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు.
దీంతో అయనను ముఖ్యమనంత్రి నితీష్ కుమార్ పదవి నుంచి తప్పించారు. ఆదివారం విలేకరులు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో ఓ వ్యక్తి నుంచి రూ.4 లక్షలు తీసుకుంటూ అవదేష్ పట్టుబడ్డాడు. దీంతో, ప్రభుత్వంపై అవినీతి మచ్చ పడకుండా ఉండేందుకు ఆయనను పదవి నుంచి తొలగించారు.
ఈ నేపథ్యంలో అవదేశ్ కూడా తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ప్రస్తుతం ఆయన పిప్రా నుంచి జేడీయు తరఫున పోటీ చేస్తున్నారు. ముంబైకి చెందిన ఓ వ్యాపారి దగ్గర.. జెడీయు మళ్లీ అధికారంలోకి వస్తుందని, తప్పకుండా మీతో కలిసి పని చేస్తామని అవదేశ్ చెప్పిన దృశ్యాలు సోషల్ మీడియాలో వచ్చాయి.
రిజర్వేషన్ల పైన మోడీ స్పష్టత
రిజర్వేషన్ వ్యవస్థను రద్దు చేసే ప్రసక్తి లేనేలేదని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం స్పష్టం చేశారు. అంతేకాదు, రిజర్వేషన్లు ముప్పులో పడ్డాయంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిసారీ కొంతమంది అబద్ధాలకోరులు రిజర్వేషన్లను రద్దు చేయబోతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, వాజపేయి ప్రభుత్వం సమయంలోనూ ఇది జరిగిందన్నారు.
ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపి తీరాలని, సమాజాన్ని భయోత్పాతానికి గురి చేయడం ఆగాలని, ఇది రాజకీయం కాదన్నారు. ఎన్నికలు దగ్గర పడినప్పుడల్లా ఈ పుకార్ల ప్రచారం ప్రారంభమవుతుందని, ఎన్నికలు దగ్గరపడినప్పుడల్లా ప్రతిపక్షాలు రిజర్వేషన్లపై చర్చను ప్రారంభిస్తుందన్నారు.
రిజర్వేషన్ల విధానంపై పునరాలోచన లేనేలేదని స్పష్టం చేశారు. ఇది బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన వరమని, దీన్ని ఏ శక్తి మననుంచి లాక్కోలేదన్నారు. నేను పేదరికం చూశానని, అందులో బతికానని, సమాజంలోని అట్టడుగు వర్గాలను సముద్ధరించడానికి చేయాల్సింది ఎంతో ఉందన్నారు.
వారి కోసమే అంబేద్కర్ శ్రమించారన్నారు. అంబేడ్కర్ లేకుంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉండేవాడిని కాదన్నారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం అన్నారు. పంచ్తీర్థ్గా అంబేడ్కర్ నడయాడిన ప్రదేశాలు ఉంటాయని చెప్పారు. ఆయన ముంబైలో మాట్లాడారు.