ప్రతి హిందూ మహిళ నలుగుర్ని కనాలి: సాక్షి మహరాజ్
మీరట్: బిజెపి ఉన్నావో పార్లమెంటు సభ్యుడు సాక్షి మహరాజ్ మరో వివాదానికి తెర తీశారు. గతంలో చేసిన వ్యాఖ్యలకు పార్లమెంటులో విచారం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన మానుకోలేదని అనిపిస్తోంది. ప్రతి హిందూ మహిళ కనీసం నలుగురు పిల్లలను కనాలని ఆయన సూచించారు.
శుక్రవారం మీరట్లో జరిగిన సంత్ సమాగమ్ మహోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఆ వ్యాఖ్య చేశారు. నలుగురు భార్యులు, 40 మంది పిల్లలు ఉండాలనే దృష్టికోణం భారతదేశంలో పనిచేయదని, హిందూ మతాన్ని రక్షించడానికి ప్రతి హిందూ మహిళ కనీసం నలుగురు పిల్లలకు జన్మ ఇవ్వాలని ఆయన అన్నారు. ఘర్ వాపసి మతమార్పిడులకు సమానమైంది కానప్పటికీ మతమార్పిడులకు పాల్పడేవారికి మరణ శిక్ష వేయాలని ఆయన అన్నారు.
కాస్తా వేచి ఉండండని అంటూ గోహత్యకు పాల్పడినవారికి, మతమార్పిడులకు పాల్పడినవారికి మరణ శిక్ష విధించే చట్టాన్ని పార్లమెంటు చేస్తుందని ఆయన అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ రామ మందిర నిర్మాణం జరుగుతుందని ఆయన అన్నారు.
ఘర్ వాపసీ కార్యక్రమాన్ని అపేది లేదని, అది నిరంతర ప్రక్రియ అని సాధ్వి ప్రాచీ అన్నారు. భారత్ ఇంతకు ముందు హిందూ దేశమని, ఇది హిందువులకు చెందిందని, హిందువులకే చెందుతుందని, హిందూయిజాన్ని స్వీకరించాల్సి ఉంటుందని ఆమె అన్నారు.