జడ్జికి 100 కోట్ల లంచం ఆఫర్! సోహ్రాబుద్దీన్ కేసులో, అమిత్ షాకు సానుకూల తీర్పు కోసం...
పలు కేసుల్లో నిందితుడైన సోహ్రాబుద్దీన్, అతడి భార్య కౌసర్ బీ లను 2005 నవంబర్లో గుజరాత్ ఏటీఎస్ అధికారులు ఎన్కౌంటర్ చేశారు. అయితే..
ముంబై: గ్యాంగ్స్టర్ సోహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో అమిత్ షాపై సానుకూలంగా తీర్పు వెలువరించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బ్రిజ్గోపాల్ లోయాకు రూ.100 కోట్లు లంచం ఇవ్వజూపారని ఆయన కుటుంబీకులు సంచలన ఆరోపణలు చేశారు. సాక్షాత్తు అప్పటి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా ఈ ఆఫర్ ఇవ్వజూపడం గమనార్హం.
పలు కేసుల్లో నిందితుడైన సోహ్రాబుద్దీన్, అతడి భార్య కౌసర్ బీ లను 2005 నవంబర్లో గుజరాత్ ఏటీఎస్ అధికారులు ఎన్కౌంటర్ చేశారు. అయితే.. అది బూటకపు ఎన్కౌంటర్ అని, ఆ కేసులో ఇప్పటి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా సహా పలువురు పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయమున్నట్లు ఆరోపణలొచ్చాయి.
ఈ క్రమంలోనే 2010లో అమిత్ షాను సీబీఐ అరెస్టు చేసింది. ఇదిలా ఉంటే కేసు విచారణకు నేతృత్వం వహిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి 2013 డిసెంబర్ 1 అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన గుండెపోటుతోనే మృతి చెందారని పోస్టు మార్టం నివేదికలో వచ్చింది.
అయితే.. దాదాపు మూడేళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చిన లోయా కుటుంబీకులు కీలక అంశాలు లేవనెత్తుతున్నారు. లోయాది హత్యేనని పరోక్షంగా ఆరోపించిన వారు.. విచారణ సమయంలో ఆయనకు లంచం ఇవ్వజూపారని చెప్పడం చర్చాంశనీ యంగా మారింది. న్యాయమూర్తి మోహిత్ షా ఇచ్చిన ఆఫర్ (డబ్బు, ముంబయిలో ఓ ఇల్లు) గురించి లోయా చనిపోవడానికి కొన్ని వారాల ముందు తనతో చెప్పారని ఆయన సోదరి అనురాధ బియాని వెల్లడించారు.
లోయా కంటే ముందు సోహ్రాబుద్దీన్ బూటకపు కేసు విచారణ చేపట్టిన జడ్జి జెటి ఉట్పత్ కొన్ని వారాల్లోనే సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి పుణే సెషన్స్ కోర్టుకు బదిలీ అయ్యారు. ఈ కేసులో అమిత్ షా కోర్టుకు పలుమార్లు హాజరవకపోవడంపై ఉట్పత్ ఒకానొక సమయంలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే 2014 జూన్ 26న అమిత్షా.. సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరు కావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే.. అమిత్షా హాజరయ్యే తేదీకి ఒకరోజు ముందే(జూన్ 25) జడ్జి ఉట్పత్ ఆ కోర్టు నుంచి బదిలీ అవడం అప్పట్లో చర్చాంశనీయమైంది.