ఫొణి తుఫాను విధ్వంసం: పుణ్యక్షేత్రం పూరీపై కన్నెర చేసిన జలరాకాసి...8మంది మృతి
Recommended Video
ఒడిషా/కోల్ కతా: ఫొణి తుఫాను ఒడిషాను అతలాకుతలం చేసేసింది. గంటకు 175 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు పెద్ద పెద్ద టెలిఫోన్ టవర్లనే పెకిలించేశాయి. ఈ పెను తుఫాను ధాటికి ఏకంగా బస్సులే కొట్టుకుపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రతరంగా ఉన్నిందో అంచనా వేయొచ్చు. గ్రామాలకు గ్రామాలు అనాథలయ్యాయు. ఇక ఈ జలరాకసి సృష్టించిన బీభత్సానికి 8 మంది మృతి చెందారు. ఇంక పూర్తి స్థాయి సమాచారం కోసం ఎదురు చూస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్పై పడగ విప్పనున్న ఫొణి
ఒడిషా నుంచి ఉత్తరం వైపు ఈశాన్య దిశగా ఫొణి తుఫాను పయనిస్తోందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రానున్న 12 గంటల్లో ఇది పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తుందని చెప్పారు. ఆ సమయంలో గాలులు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వివరించారు. గత 6 ఆరుగంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఫొణి తుఫాను ఈశాన్యం వైపు కదిలిందని వెదర్ డిపార్ట్మెంట్ పేర్కొంది. పశ్చిమ బెంగాల్లోని మిద్నాపూర్కు 110 కిలోమీటర్ల దూరంలో ఫొణి కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు. ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఫొణి తుఫాను కారణంగా కోల్కతా నుంచి భువనేశ్వర్కు వెళ్లాల్సిన విమాన సర్వీసులను రద్దు చేయడం జరిగింది. ఒడిషాలో పారదీప్ గోపాల్ పూర్ పోర్టులు కూడా మూసివేశారు.
పుణ్యక్షేత్రం పూరీపై కన్నెర్ర చేసిన ఫొణి
ఒడిషాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరిపై పగబట్టినట్లుగా ఫొణి తుఫాను వ్యవహరించింది. ఆ ప్రాంతం మొత్తాన్ని అతలాకుతలం చేసేసింది. గుడిసెలు కొట్టుకుపోయాయి. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒడిషా మొత్తం మీద పూరి నగరమే భీకరంగా దెబ్బతినింది. పూరీలో ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమీక్షించారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇక బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురిసినట్లు తెలుస్తోంది.
విమానసర్వీసులు, రైళ్లు రద్దు
ఫొణి తుఫాను ప్రభావంతో 220 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కూడా ఫొణి ప్రభావిత రాష్ట్రాలకు విమానసర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. భువనేశ్వర్కు 10 విమానసర్వీసులు రద్దుకాగా కోల్కతాకు 15 సర్వీసులు రద్దు అయ్యాయి. ఇక ఫొణి తుఫాను ఈశాన్య భారతాన్ని కుదిపేయనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో మేఘాలయా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తున్న ఈ తుఫాను క్రమంగా ఈశాన్య భారతాన్ని కూడా టచ్ చేసే అవకాశాలున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అస్సోం ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.