పోలీసుల పైశాచికం: రైతుకు మూత్రం తాగించారు
ఝాన్సీ: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని లలిత్పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన మాట విన్లేదని ఓ రైతును చితకబాదిన ఓ పోలీసు అధికారి, అతనితో మూత్రం తాగించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందిత పోలీసు అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు జరిపిన తర్వాత నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పి తెలిపారు.
లలిత్పూర్ జిల్లాలోని భౌరండాలో కాన్సీరాం అనే రైతుకు కొన్ని ఎకరాల భూమి ఉంది. ఇది మెహ్రోని పోలీస్స్టేషన్ పరిధిలోకి వస్తుంది. తన సొంత భూమిలో కూడా వ్యవసాయం చేయనివ్వకపోవడంతో పలువురు గ్రామస్తులపై కాన్సీరాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితునికి అండగా నిలవాల్సిన పోలీసులు అతడ్నే నిందితుడిగా పరిగణించారు.
అంతేగాక కాన్సీరాం తన సొంత భూమిలో వ్యవసాయం చేసుకోకూడదని స్టేషన్ ఆఫీసర్ విజయ్ సింగ్ ఆదేశాలు జారీ చేశాడు. అయితే ఇందుకు కాన్సీరాం నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన విజయ్ సింగ్.. కాన్సీరాంను కానిస్టేబుళ్ల చేత చితకబాదించాడు. అంతటితో ఆగకుండా అతనికి పోలీస్ స్టేషన్లో మూత్రం తాగించాడు.. తీవ్ర ఆవేదనకు గురైన బాధితుడు పోలీసు ఉన్నతాధికారులకు పిర్యాదు చేశాడు.
స్పందించిన లలిత్పూర్ ఎస్పి విజయ్ యాదవ్ సోమవారం నిందిత ఎస్ఓ విజయ్ సింగ్ను పోలీస్ లైన్స్కు పంపించారు. ఇలాంటి ఘటనలను తాము సహించబోమని ఎస్పి తెలిపారు. ఘటనపై పూర్తి దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నేరం రుజువైతే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, నిందితుడిపై చర్యలు తీసుకోకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బాధిత రైతు కాన్సీరాం చెప్పాడు.