బడాబాబుల రుణాలు మాఫీ చేసినప్పుడు..రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయరు: రాహుల్ గాంధీ
ఢిల్లీ: రైతుల మంచి భవిష్యత్తు కోసం అన్ని విపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చి రైతులకు అండగా నిలుస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పార్లమెంటును ముట్టడికి బయలు దేరుతుండగా అన్ని ద్వారాలు అధికారులు మూసివేశారు. జంతర్ మంతర్ దగ్గర రైతులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశంలోని రైతుల గొంతును యువత గొంతును ఎవరూ నొక్కి పట్టుకోలేరని అన్నారు. భారత ప్రభుత్వం రైతులను, యువతను అవమానిస్తే కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారని రాహుల్ అన్నారు.
రైతులు ప్రభుత్వం నుంచి ఏదీ బహుమానంగా అడగడం లేదని వారి డిమాండ్లు న్యాయపరమైనవని అన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు సంబంధించి రూ. 3.5 లక్షల కోట్లు రుణాలను మాఫీ చేయగలిగినప్పుడు రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయలేకపోతోందని ప్రశ్నించారు. గురువారం నుంచి చలికి రాంలీలా మైదానంలోనే రైతులు ఉంటున్నారు. శుక్రవారం ఉదయం పార్లమెంటు ముట్టడికి బయలుదేరిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
దేశ నలుమూలల నుంచి అంటే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో రైతులు తమ నిరసన వ్యక్తం చేసేందుకు ఢిల్లీ చేరుకున్నారు.