ఢిల్లీలో దిక్కులు పిక్కటిల్లేలా రైతుల నిరసన.. పసుపు పచ్చ దుపట్టాతో, కేంద్రానికి 2 వేల మంది వితంతువుల ప్రశ్న
అన్నదాతల నిరసనలతో దేశ రాజధాని ఢిల్లీ, ఢిల్లీ సరిహద్దులు మార్మోగుతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రోజు రోజుకు నిరసనకారుల సంఖ్య పెరుగుతుండటంతో, అక్కడి పరిస్థితులు రోజుకో రకంగా మారుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో దిక్కులు పిక్కటిల్లేలా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా, ఎంతో మంది రైతులు ప్రాణాలను కోల్పోతున్నప్పటికి ఆందోళన చేస్తూనే ఉన్నారు.

రైతులతో పాటు ఆందోళనలలో వితంతువులు
ప్రభుత్వ మొండి వైఖరిని విడనాడాలని, రైతులకు నష్టం చేసే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన సాగిస్తున్నారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా రెండు వేల మంది రైతు కుటుంబాలకు చెందిన వితంతువులు ఢిల్లీ అన్నదాతల ఆందోళనలో పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో సంచలన మార్పులు చేస్తున్నట్లుగా సెప్టెంబరులో అమల్లోకి వచ్చిన సంస్కరణలపై రైతులు దాదాపు నెల రోజుల నుండి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఉద్యమానికి మహిళలు కూడా తోడయ్యారు. వ్యవసాయ కుటుంబాలలో తమ వారిని కోల్పోయిన మహిళలు కేంద్రాన్ని దీనంగా అభ్యర్థించారు .

చనిపోయిన రైతుల ఫోటోలతో బతికున్న వారి కుటుంబాల నిరసన
ఆందోళనలో పాల్గొన్న రెండు వేల మంది రైతు కుటుంబాలకు చెందిన వితంతువులు వారి చేతుల్లో తమ భర్తల, తండ్రుల, కుమారుల ఫోటోలు పెట్టుకొని తలపై పసుపుపచ్చని దుపట్టా లను కప్పుకొని ఆందోళనను తెలియజేశారు. తమ జీవితాలలో లేని పచ్చదనాన్ని , తమ భర్తలను కోల్పోయి పచ్చని కాపురాలు బుగ్గి పాలయ్యాయి అన్న సంకేతాలను తెలియజేస్తూ పాత వ్యవసాయ విధానంతోనే ఇంత మంది మహిళలు వితంతువులము అయ్యాము అని చెబుతూ, రైతులకు హాని అని చెప్తున్న నూతన వ్యవసాయ చట్టాలు అమలైతే తమవంటి ఇంకెందరు మహిళలు వితంతువులు గా మారతారో నంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా వ్యవసాయ చట్టాలతో ఎందర్ని వితంతువులను చేస్తారో చెప్పాలని కేంద్రానికి ప్రశ్న
అన్నీ బాగుంటేనే ఇంత మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఇక తాజా వ్యవసాయ చట్టాలతో మరింత మంది చనిపోతారో అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందర్ని వితంతువులను చేస్తారో చెప్పాలని కేంద్రానికి ప్రశ్న వేశారు. చనిపోయిన వారి ఫొటోలతో బతికి ఉన్న వారు చేసిన ఆందోళన అక్కడి వారి మనసులను కలచివేసింది . వ్యవసాయంలో నష్టాలు రావటం , అప్పుల బాధలు తట్టుకోలేకపోవటం , అతి వృష్టి , అనావృష్టి వల్ల నష్టాలు రైతుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయటం , ప్రభుత్వం ఏ విధంగానూ బాసటగా నిలవకపోవటం వెరసి వేలాదిగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులు ... ఆగని మరణాలతో రైతుల కుటుంబాల్లో ఆందోళన
రైతులు ఆరుగాలం కష్టపడుతూ కూడా ఆత్మహత్య చేసుకోవడం భారతదేశంలో కొన్నేళ్లుగా సమస్యగా ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, 2018 లో దాదాపు 10,350 మంది రైతులు మరియు వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు . భారతదేశంలో మొత్తం ఆత్మహత్యలలో దాదాపు 8% మంది రైతులే ఉన్నారు. ఇప్పటికే రైతుల అత్మతయాల పరంపర కొనసాగుతూనే ఉంది . ఈ సమయంలో కొత్తగా వచ్చిన వ్యవసాయ చట్టాలు కూడా రైతులకు నష్టం చేస్తాయని భావించి వాటిని రద్దు చెయ్యాలని రైతులు ఆందోళనలు సాగిస్తున్నారు. తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .












Click it and Unblock the Notifications