రేపే భారత్ బంద్..బంద్ కు ఏపీ సర్కార్ మద్దతు, రైతు సంఘాల విజ్ఞప్తి ఇదే!!
కేంద్రం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కొనసాగిస్తున్న ఆందోళన ఉధృతమవుతోంది . నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా మార్చి 26 వ తేదీన భారత్ బంద్ ను నిర్వహించాలని, గ్రామీణ స్థాయిలో కూడా బంద్ ను కొనసాగించాలని దేశ పౌరులకు విజ్ఞప్తి చేసింది.
ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భారత్ బంద్
దాదాపు నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దులలో కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.ఇక రేపు భారత్ బంద్ లో భాగంగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు బంద్ నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా కోరింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రహదారులు, రైలు రవాణా, మార్కెట్ లు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలు అన్నీ మూసివేయాలని విజ్ఞప్తి చేసింది. భారత్ బంద్ ను విజయవంతం చేయాలని, అన్నదాతలను గౌరవించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని రైతు సంఘం నాయకుడు దర్శన్ పాల్ పేర్కొన్నారు.
దేశ వ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తున్న రైతు సంఘాల నాయకులు
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ గత నాలుగు నెలలుగా పంజాబ్ ,హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుండి వేలాది మంది రైతులు దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తాత్కాలిక గుడారాలు తీసివేసి ఆందోళన కొనసాగించటానికి శాశ్వత నిర్మాణాలను సైతం ఏర్పాటు చేసుకున్న రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేయడానికి కిసాన్ మహా పంచాయత్ లను నిర్వహిస్తున్నారు.
కేంద్ర సర్కార్ పై ఒత్తిడికి యత్నం .. బంద్ కు ఏపీ సర్కార్ మద్దతు
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న నిరసన నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న భారత్ బంద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. రైతు సంఘాలు ,విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన బంద్ కు సంఘీభావం ప్రకటించిన ఏపీ సర్కార్ ప్రజలకు అసౌకర్యం కలగకుండా బంద్ ను శాంతియుతంగా నిర్వహించాలని పేర్కొంది.
బంద్ సమయంలో అత్యవసర ఆరోగ్య సేవలన్నీ యధావిధిగా
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేసింది. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులుమధ్యాహ్నం ఒంటి గంట వరకు బంద్ చెయ్యనున్నట్టు మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు . బంద్ సమయంలో అత్యవసర ఆరోగ్య సేవలన్నీ యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. రైతులు చేస్తున్న భారత్ బంద్ కి ఇప్పటికే టీడీపీ , కమ్యూనిస్ట్ , కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి.