నవీన్ పట్నాయక్ ప్రైవేట్ సెక్రటరీకి అరుదైన గౌరవం-FIH ప్రెసిడెంట్స్ అవార్డ్కు ఎంపిక
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కార్తికేయన్ పాండియన్కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఎఫ్ఐహెచ్ ప్రెసిడెంట్స్ అవార్డు ఆయన్ను వరించింది. చిన్నప్పటి నుంచి అథ్లెట్ అయిన పాండియన్ ఇప్పుడు అంతర్జాతీయ స్ధాయి అవార్డుకు ఎంపిక కావడం విశేషం.
2011 నుంచి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న కార్తికేయన్ పాండియన్.. తాజాగా FIH కాంగ్రెస్ సమావేశంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. దీనిపై ఆయన మాట్లాడుతూ " ఎంతో సంతోషంగాఉంది. క్రీడలంటే నాకెంతో ఇష్టం. దీనంతటికీ మా టీమే కారణం. భారత క్రీడారంగానికి మరెన్నో విజయాలు అందించేందుకు ఈ పురస్కారం నాకు తోడ్పడుతుంది. 2018లో భువనేశ్వర్లో జరిగిన పురుషుల హాకీ వరల్డ్ కప్ సందర్భంగా మేం చేసిన కృషికి లభించిన ఫలితమిది. మా సీఎం నవీన్ పట్నాయక్ ప్రోత్సాహం లేకపోతే ఇదంతా జరిగేదే కాదు." అన్నారు.
అథ్లెటిక్స్లో 800 మీటర్లు, 1500 మీటర్ల విభాగాల్లో యూనివర్శిటీ ఛాంపియన్ కూడా అయిన పాండియన్.. మధురైలో పుట్టారు. నైవేలీ స్పోర్ట్స్ హాస్టల్లో ఉంటూ తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. మధురైలోని వ్యవసాయ కళాశాల నుంచి బీఎస్సీ పట్టా అందుకున్నారు.
అనంతరం సివిల్స్ రాసి ఐఏఎస్గా ఎంపికయ్యారు. ఒడిశా క్రీడారంగంపై స్పందించిన ఆయన.. దేశంలో వెయిట్లిఫ్టింగ్, అధ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, హాకీలో హై పర్ఫార్మెన్స్ సెంటర్ నడుపుతున్నఏకైక రాష్ట్రం ఒడిశానే అని చెప్పారు. ఇవన్నీ కార్పోరేట్ ఒప్పందాలతోనే నడిపిస్తున్నామన్నారు. తాజాగా FIH అవార్డుఅందుకున్న సందర్భంగా సీఎం నవీన్ కార్యాలయం ఆయననపై ప్రశంసల జల్లు కురిపించింది. ఫిట్నెస్ ఫ్రీక్ అయిన పాండియన్ క్రమశిక్షణ, శ్రమ, దూరదృష్టి వల్లే ఒడిశా క్రీడల్లో రాణిస్తోందని ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన్ను ప్రశంసించింది.