బిహార్లో నేడే చివరి విడత ఎన్నికలు... ఎన్డీయే వర్సెస్ మహాకూటమి... ఇవీ అక్కడి కుల సమీకరణాలు...
బిహార్లో శనివారం(నవంబర్ 7)మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. చివరి విడతగా జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తం 78 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1,204 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఛత్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రముఖ బీజేపీ నేత,దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ బంధువు నీరజ్ కుమార్ సింగ్తో పాటు బిహారీగంజ్ నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కుమార్తె,కాంగ్రెస్ అభ్యర్థి సుభాషిణి శరద్ యాదవ్,బిహార్ అసెంబ్లీ స్పీకర్,జనతాదళ్ అభ్యర్థి వినయ్ కుమార్ చౌదరి,ముజఫర్పూర్ నుంచి పోటీ చేస్తున్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి,బీజేపీ అభ్యర్థి సురేశ్ కుమార్ శర్మల భవితవ్యాన్ని ఈ ఎన్నికల్లో ఓటర్లు డిసైడ్ చేయనున్నారు.
Recommended Video
బిహార్ ఎన్నికల్లో రెండో దశ: రాహుల్ గాంధీ షెడ్యూల్ ఫిక్స్: రోడ్ షోలు..ర్యాలీలు: గెలుపుపై ఆశలు
పప్పు యాదవ్కు పట్టు ఉన్న ప్రాంతం...
ఎల్జేపీ(లోక్ జనశక్తి పార్టీ) బరిలో ఉన్నప్పటికీ... మూడో విడత ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీయే-మహాకూటమి మధ్యనే ఉండనుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 78 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికం కోసి-సీమాంచల్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడ మాజీ ఎంపీ,జన్ అధికార్ పార్టీ అధినేత పప్పు యాదవ్కు మంచి పట్టు ఉంది. దీంతో మూడో విడతలో ఆయన పార్టీ ప్రభావం చూపిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఉపేంద్ర కుశ్వాహా నేత్రుత్వంలోని ఆర్ఎస్ఎల్పీ,అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం,మాయావతి బీఎస్పీ పార్టీలు కూడా ఇక్కడ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి.
కుల సమీకరణాలు...
మూడో విడతలో కుల సమీకరణాలు కూడా ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. బిహార్లో అత్యంత వెనుకబడ్డ ప్రాంతాల్లో కోసి ఒకటి. ఇతర రాష్ట్రాల్లోకు వలస వెళ్లే జనాల్లో ఇక్కడినుంచే ఎక్కువమంది ఉంటారు. కోసి ప్రాంతంలో ఉన్న మాధెపురా అసెంబ్లీ నియోజకవర్గంలో 'రోమ్ నగరం పోప్లది... మాధెపురా గోపులది..' అన్న నినాదం చాలాకాలంగా పాపులర్. గోపులు అంటే యాదవులు అని అర్థం. కోసి ప్రాంతంలోని నాలుగో వంతు ఓటర్లలో ఒక వంతు యాదవులే ఉన్నారు. అలాగే ఇక్కడ బీసీలు,ముస్లింల ప్రాబల్యం కూడా ఎక్కువే. దీంతో ఎన్నికల్లో వీరు ఎవరివైపు మొగ్గుచూపితే వారికే విజయావకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల వరకూ వీరంతా ఆర్జేడీకే ఓటు వేస్తూ వచ్చారు.
అక్కడ ముస్లిం ఓట్లే కీలకం...
మూడో విడత ఎన్నికలు జరగనున్న అరారియా,కటిహార్,కిషన్గంజ్ జిల్లాల్లో దాదాపు 30శాతం ముస్లిం జనాభా ఉంది. రాష్ట్రంలో ముస్లింల సగటు కంటే ఇది రెట్టింపు. దీంతో ఈ మూడు జిల్లాల్లో ముస్లింలు ఎన్నికలను ప్రభావితం చేయనున్నారు. కిషన్గంజ్ ప్రాంతం ఠాకూర్గంజ్,బహదూర్ గంజ్,కిషన్గంజ్... ఇలా మూడు అసెంబ్లీ నియోజకవర్గాలుగా విడిపోయి ఉంది. ఇక్కడి మూడో వంతు ఓటర్లలో రెండో వంతు ముస్లింలే. దీంతో ఎంఐఎం పార్టీ ఇక్కడ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.