హెచ్ఆర్డీకి షాక్: జియో ఇన్స్టిట్యూట్కు ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్’ ట్యాగ్పై ఆర్థికశాఖ ఫైర్
ఢిల్లీ: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన జియో ఇన్స్టిట్యూట్కు కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ( ఔన్నత్యం చాటుతున్న విద్యాలయం) ట్యాగ్ను ఇవ్వడాన్ని కేంద్ర ఆర్థిక శాఖ తప్పుబట్టింది. సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాచారం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ మానవవనరుల శాఖను తప్పుబట్టినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇంకా స్థాపితం కాని ప్రైవేట్ విద్యాలయాలకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఇవ్వడం ఏమిటని కేంద్ర ఆర్థిక శాఖకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ లేఖ రాసింది.
ఇంకా విద్యాలయాలు పూర్తి కాక ముందే ఇన్స్టిట్యూట్ ఆఫ ఎమినెన్స్ లాంటి ట్యాగులు కేటాయించడం వల్ల ఇప్పటికే ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ యూనివర్శిటీలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. కేంద్ర ఆర్థిక శాఖ మాత్రమే కాదని... హెచ్ఆర్డీ శాఖలో కూడా ఇది కేటాయించడంపై అనుమానం ఉందని నివేదిక తెలిపింది. అంతేకాదు ఇప్పటికే ఏర్పాటై నడుస్తున్న విద్యాలయాలకు మాత్రమే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఇవ్వాలి. అంతే తప్పితే ఇంకా ఏర్పాటు కాని విద్యాలయాలకు ట్యాగ్ ఇవ్వడం విద్యావ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఆర్థికశాఖకు రాసిన లేఖలో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ పేర్కొంది.
మరో డివిజన్ బెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ట్యాగ్ ఇవ్వాలంటే మరో ప్రతిపాదన తీసుకొచ్చింది. విద్యాలయం నుంచి ఐదు లేదా ఆరు బ్యాచ్లు పాస్ ఔట్ అయి ఉండి... ఆ విద్యాలయం ఏర్పాటు చేసి 8 నుంచి 10 ఏళ్లు పూర్తయి ఉంటే అందులో పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ట్యాగ్ ఇవ్వాలని సూచించింది. ఇంకా ఏర్పాటు కానీ విద్యాలయాలకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ట్యాగ్ ఇవ్వడాన్ని తప్పుబడుతూ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అందులో జియో విద్యాలయానికి ప్రభుత్వం ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు కూడా తప్పుబట్టాయి. దీంతో దిగొచ్చిన మానవవనరుల శాఖ జియో విద్యాలయం గ్రీన్ ఫీల్డ్ కేటగిరీ కింద ఎంపికైందనే సమాధానం ఇచ్చింది.