యూపీలో దుమారం రేపుతున్న మాయావతి పోస్టర్..!
రాజకీయాల్లో వివాదాలు కొత్తేమి కాదు. సిద్ధాంతాలను వ్యతిరేకించే క్రమంలో వ్యక్తిగత విమర్శలకు దిగడం ఇప్పుడున్న రాజకీయాల్లో షరా మామూలే అయిపోయింది. తాజా వివాదానికి కేంద్రబిందువుగా మారారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. సొంత పార్టీ నేతలే చేశారో.. లేక బయటి వ్యక్తుల పనో.. తెలియదు గానీ మొత్తానికి ఇప్పుడో పోస్టర్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
పోస్టర్ విషయానికి వస్తే.. బీజేపీ నేతలే టార్గెట్ గా రూపొందించిన ఈ పోస్టర్ లో.. బీఎస్పీ అధినేత్రి మాయావతి కాళీమాత రూపంలో కనిపిస్తున్నారు. అలాగే అమ్మవారు తన చేతిలో రాక్షసుడి తలను పట్టుకున్నట్టుగా.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తలకాయను మాయావతి పట్టుకోవడం.. ఆర్.ఎస్.ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ని కాలుతో తొక్కి చంపేస్తున్నట్టుగా పోస్టర్ డిజైన్ చేయడం.. కాళికా అమ్మవారి మెడలో ఉండే పుర్రెల లాగా ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి తలల్ని మాయవతి మెడలో అలంకరించడం వివాదస్పదమవుతున్నాయి.
పోస్టర్ తీవ్రతను మరింత పెంచేలా ప్రధాని మోడీని కూడా వలిపెట్టకపోవడం గమనార్హం. మాయావతి బారి నుండి తప్పించుకోవడానికి కాళికా రూపంలోఉన్న మాయావతిని మోడీ శరణు కోరుతున్నట్లుగా పోస్టర్ తయారు చేశారు. ఇప్పటికైతే ఈ పోస్టర్ పై ఇటు మాయావతి గానీ అటు బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ నేతలు గానీ స్పందించలేదు. చూడాలి మరి ఈ వివాదం ఇక్కడికే పరిమితమవుతుందో.. లేక యూపీ రాజకీయాల్లో దుమారమే రేపుతుందో..!