వివాహ వేదికలో అగ్నిప్రమాదం
యూపీలోని మొరాదాబాద్లోని గల్షహీద్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఐదుగురు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మూడంతస్తుల భవనంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి మూడుగంటలకు పైగా సమయం పట్టింది. 12 మందిని రక్షించారు. మొరాదాబాద్ జిల్లా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. భవనం యజమాని ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో స్క్రాప్ మెటీరియల్ను నిల్వ చేయగా, గుర్తుతెలియని కారణాలతో స్క్రాప్లో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు.
అగ్ని సంభవించిన ఇంట్లో ముగ్గురు సోదరుల ఉమ్మడి కుటుంబం నివసిస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు మైనర్ పిల్లలతో సహా ఇప్పటి వరకు ఐదుగురు మరణించగా ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన జరగడం వెనుక కారణాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వివాహాలు చేసుకునేవారికి అద్దెకు ఇస్తుంటారని, గ్రౌండ్ ఫ్లోర్ లో నిల్వ ఉంచిన స్క్రాప్ లో ఏమైనా పేలుడు పదార్థాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వివాహ వేడుక జరిగే సమయంలో అగ్నిప్రమాదం జరిగితే నష్టం భరించరాని స్థాయిలో ఉండేదన్నారు.