హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో ఒక మహిళ, ఓ చిన్నారి ఉన్నారు. కరోల్బాగ్ ప్రాంతంలోని హోటల్ అర్పిత్ ప్యాలెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్నవారు బయటకు పరుగులు పెట్టారు. తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు ఫైర్ యాక్సిడెంట్ సంభవించడంతో మృతుల సంఖ్య ఎక్కువయింది. అందరూ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 20 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పుతున్నారు. హోటల్లో చిక్కుకున్న 50 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఢిల్లీలో ఇటీవల అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటం చర్చానీయాంశమైంది. సరిగ్గా నెలరోజు కిందట వెస్ట్ ఢిల్లీలో జరిగిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. కీర్తి నగర్ లోని ఫర్నీచర్ షాపులో చెలరేగిన మంటలు క్షణాల్లో దావానంలా వ్యాపించాయి. దీంతో ఎగిసిపడ్డ అగ్నికీలలు పక్కనే ఉన్న మురికివాడకు వ్యాపించాయి. పేదలు నివాసముండే గుడిసెలు, ఇళ్లు 100 వరకు కాలి బూడిదయ్యాయి. దీంతో అందులో నివసిస్తున్నవారు నిరాశ్రయులయ్యారు.
Spot visuals: 9 dead in the fire that broke out in Hotel Arpit Palace in Karol Bagh, earlier today. Rescue operation still underway. #Delhi pic.twitter.com/F2KNcozrZK
— ANI (@ANI) February 12, 2019