ఎవరిదీ పాపం.. నాలుగు రోజులు తిండి లేక తల్లడిల్లిన చిన్నారి మృతి..
కరోనా లాక్ డౌన్ పేదలు,వలస కూలీల ఉసురు తీస్తోంది. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి కాలినడకన సాగుతూ మార్గమధ్యలో కొందరు.. ఆకలితో అలమటిస్తూ మరికొందరు మృత్యువాతపడుతున్నారు. తాజాగా జార్ఖండ్లోని లాతేహర్ జిల్లాలో మరో ఆకలి చావు చోటు చేసుకుంది. నాలుగు రోజుల పాటు తిండి లేక ఆకలితో అలమటించిన నిమని అనే ఓ చిన్నారి చివరకు ప్రాణాలు వదిలింది. బతుకుదెరువు కోసం వలస వెళ్లిన తండ్రి వేరే ప్రాంతంలో చిక్కుకుపోవడంతో ఆ కుటుంబానికి తిండి కరువై చివరకు చిన్నారిని కోల్పోవాల్సి వచ్చింది.
దళిత సామాజిక వర్గానికి చెందిన ఆ చిన్నారి కుటుంబానికి రేషన్ కార్డు లేదు. గ్రామంలో భూమి కూడా లేదు. తినేందుకు కూడా ఇంట్లో ఏమీ లేకపోవడంతో ఆ కుటుంబం ఆకలితో అలమటిస్తోంది. వరుసగా నాలుగు రోజుల పాటు ఏమీ తినకపోవడంతో నిమని శనివారం(మే 16) సాయంత్రం అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రాణాలు విడిచింది.

నిమని తండ్రి జగ్లాల్ భుయాన్ బతుకుదెరువు కోసం లాతేహర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా అతను అక్కడే చిక్కుకుపోయాడు. దీంతో గత రెండు నెలలుగా తన పిల్లలకు తిండి పెట్టేందుకు భుయాన్ భార్య కళావతీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం నుంచి జన్ధన్ ఖాతాలో రూ.500 తప్ప మరే ఇతర సహాయ సహకారాలు ఆమెకు అందలేదు.
'తిందామంటే ఇంట్లో ఏమీ లేవు... ఆకలితో బాధపడుతూ నిమని శనివారం సాయంత్రం మృతి చెందింది.' చుట్టుపక్కలవారు కొంత సాయం చేయడం వల్ల,కొంత అప్పు చేయడం వల్ల ఇన్నాళ్లు నెట్టుకొచ్చామని తెలిపింది. చివరిసారిగా తన భర్త హోలీ పండగకు కొంత డబ్బుతో ఇంటికొచ్చాడని.. ఆ తర్వాత తిరిగి వెళ్లిన అతను మళ్లీ ఇప్పటివరకూ రాలేదని తెలిపింది.
Recommended Video
'మా కుటుంబానికి ఎవరూ రేషన్ ఇవ్వకపోవడం వల్లే నా బిడ్డ చనిపోయింది. స్కూల్స్ నడిచినప్పుడు అక్కడే మధ్యాహ్న భోజనం దొరికేది. కానీ లాక్ డౌన్ కారణంగా స్కూల్స్ కూడా మూతపడటంతో నా బిడ్డకు తిండి లేకుండా పోయింది. ఇటుక బట్టీలో పనిచేస్తున్న నేను ఇక్కడే చిక్కుకుపోయాను. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వమని అడిగితే.. లాక్ డౌన్ అయిపోయేదాకా ఓపిక పట్టాలని చెబుతున్నారు. దీంతో ఇంటికి డబ్బులు పంపించలేకపోయాను.' అని భుయాన్ ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ జీషన్ ఖమర్ స్పందించారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రముఖ ఆర్థిక నిపుణుడు జీన్ డ్రెజ్ దీనిపై మాట్లాడుతూ.. ఇది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications