Flash back 2019: బీజేపీ: లోక్ సభలో మెరుపులు.. అసెంబ్లీలో మరకలు..!
ముంబై: ఈ ఏడాది భారతీయ జనతా పార్టీ మిశ్రమ ఫలితాలను చవి చూసింది. లోక్ సభ ఎన్నికల్లో మెరుపులు మెరిపించిన కాషాయ పార్టీకి అసెంబ్లీ బరిలో మాత్రం చేదు ఫలితాలు ఎదురయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీని సాధించినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్లో చేతులు ఎత్తేసింది. ఈ ఏడాది ఏపీ, ఒడిషా సహా మొత్తం అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. ఒక్క చోట మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అది కూడా మరో పార్టీ మీద ఆధారపడి.
జార్ఖండ్ ఎఫెక్ట్?: బీజేపీ సంకీర్ణ కూటమి సర్కార్ లో లుకలుకలు: మిత్రపక్షంలో తిరుగుబాటు: రాజీనామా..!
హర్యానాలో జేజేపీ మీద ఆధారపడి..
బీజేపీ బలంగా లేని ఏపీ, ఒడిషాలను పక్కన పెడితే- మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లల్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ఖంగు తినిపించాయి. ఈ మూడు రాష్ట్రాలు కూడా ఇదివరకు బీజేపీ పాలనలో ఉన్నవే. ఒక్క హర్యానాలో తప్ప మిగిలిన రెండు చోట్లా ఎన్నికల అనంతరం బీజేపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. హంగ్ ఏర్పడిన హర్యానాలో జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ) మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. తొలుత- కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా.. ఆ తరువాత బీజేపీకి మద్దతు ఇవ్వడంతో అధికారం బీజేపీ వశమైంది.
మహారాష్ట్రలో శివసేన ఎదురు తిరిగి..
మహారాష్ట్రలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 146 మంది సభ్యుల సంఖ్యాబలం సాధించలేకపోయింది. బీజేపీకి 105 స్థానాలు, మిత్రపక్షం శివసేనకు 58 సీట్లు దక్కాయి. ఈ రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్ల కాలం పాటు పంచుకోవాలనే ఏకైక షరతును అంగీకరించడానికి బీజేపీ నిరాకరించింది. ఫలితంగా- శివసేన అడ్డం తిరిగింది. బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ససేమిరా అనడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి.
అజిత్ పవార్ మద్దతుతో..
శివసేన తీసుకున్న నిర్ణయం అనంతరం బీజేపీ ఒంటరిగా మారింది. ఆ సమయంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్.. అండగా నిలిచారు. తనకు 54 మంది సభ్యుల బలం ఉందనే లేఖను గవర్నర్ కు అందజేయడంతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీని ఆహ్వానించారు. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో ఎన్సీపీ ఎమ్మెల్యేలు అందరూ మూకుమ్మడిగా అజిత్ పవార్ కు ఎదురు తిరిగారు. శరద్ పవార్ వెంటే నిలిచారు. దీనితో దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేయక తప్పలేదు.
జార్ఖండ్ లో ఏకపక్షంగా..
ఇక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేరుగా పరాజయాన్ని చవి చూడటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. జార్ఖండ్ ముక్తిమోర్చా-కాంగ్రెస్-రాష్ట్రీయ జనతాదళ్ సంకీర్ణ కూటమిని ఢీ కొట్టలేకపోయింది బీజేపీ. స్థానిక అంశాలే బీజేపీకి ఓటమికి కారణాలయ్యాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. నిజానికి- జార్ఖండ్ లో మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 14 స్థానాలకు 12 సీట్లను దక్కించుకుంది. దీని లెక్క ప్రకారం చూస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ.. ఆ తరహా ఫలితాలు రాలేదు. బీజేపీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ సైతం ఓటమి పాలయ్యారు.