ఈ 10 రోజుల్లోనే.. వీటి రేట్లు భారీగా పెరిగాయ్
Commodities: కేంద్రం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా మూడోసారి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గాన్నీ ఏర్పాటు చేసుకున్నారు. పోర్ట్ఫోలియోల కేటాయింపూ పూర్తయింది. ఇన్ని రోజులూ రాజకీయాలపై దృష్టి పెట్టిన వారంతా ఇక పాలనను పరుగులెత్తించడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు.
నిత్యావసరుకుల మంట..
కేంద్రం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైన ఈ కొద్ది రోజుల్లోనే నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కూరగాయలూ అదే రీతిన సాగుతున్నాయి. ఉల్లిపాయలు, టమోటా, ఆకు కూరలు, ఇతర కూరగాయాలను కొనుగోలు చేయడానికి గతంలో కంటే రెట్టింపు మొత్తాన్ని ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అమూల్, మదర్ డైరీ వంటి సంస్థలు పాలరేట్లను సైతం పెంచిన విషయం తెలిసిందే.

రేట్లు పెరిగిన వస్తువులు
అదే సమయంలో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ).. అంటే- నిత్యావసర, ఆహారేతర వస్తువుల ధరలు సైతం ఆకాశానికి ఎగబాకడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రోజూ వినియోగించే సబ్బులు, డిటర్జెంట్లు, బాడీ వాష్, టూత్ పేస్ట్, షాంపూ, కాఫీ, టీ, నూడుల్స్, ఓట్స్, హెయిర్ ఆయిల్, కాస్మటిక్స్.. వంటి వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి.
రేట్లు పెంచిన కంపెనీలు..
ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఐటీసీ, గోద్రెజ్, ఇమామి, విప్రో, డాబర్ ఇండియా, హిందుస్తాన్న యూనిలీవర్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్.. వంటి ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తులను 2 నుంచి 17 శాతం వరకు పెంచాయి. తమ ఉత్పత్తులను తయారు చేయడానికి అవసరమైన ముడి వస్తువుల, పదార్థాల ధరలు పెరగడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వివరించాయి.

సబ్బులు, డిటర్జెంట్ల ధరలు పెంపు..
గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్కు చెందిన సబ్బులపై ధరలు 4 నుంచి 5 శాతం పెరిగాయి. హిందుస్తాన్ యూనిలీవర్ తన డోవ్ సబ్బుల ధరలను రెండు, విప్రో ప్రొడక్ట్ సంతూర్ సబ్బుల ధరను మూడు శాతం వరకు పెంచింది. కోల్గేట్ పామోలివ్ బాడీ వాష్ ధర 2 నుంచి 3, పియర్స్ బాడీ వాష్ నాలుగు శాతం మేర పెరిగింది.
షాంపూలనూ వదల్లేదు..
హిందుస్తాన్ యూనిలీవర్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్, జ్యోతి ల్యాబ్స్కు చెందిన డిటర్జెంట్ బ్రాండ్లు ఎంపిక చేసిన ప్యాక్లపై 1 నుంచి 10 శాతం వరకు ధరలను పెంచాయి. హిందుస్థాన్ యూనిలీవర్ అన్ని రకాల షాంపూలు, చర్మ సంరక్షణ ఉత్పత్తులను 4 శాతం వరకు పెంచింది. నెస్లే కాఫీ ధరలను 8 నుంచి 13, మ్యాగీ ఓట్స్ నూడుల్స్ 17 శాతం పెరిగాయి.












Click it and Unblock the Notifications