పాక్, చైనాతో పొరుగు సంబంధాలకు ఓకే.. కానీ.. విదేశాంగమంత్రి జైశంకర్ కామెంట్స్..
భారత్ లో గత రెండేళ్లలో పాకిస్తాన్, చైనా నుంచి సరిహద్దుల్లో ముప్పు పెరుగుతోంది. ఇప్పటికే చైనాతో గల్వాన్ ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. చైనా అరుణాచల్ ప్రదేశ్ వైపు నుంచి భారత్ లోకి చొచ్చుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కొంతమేర భారత భూభాగం ఆక్రమించినట్లు కూడా వార్తలొస్తున్నా కేంద్రం మాత్రం ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్,చైనా విషయంలో విదేశామంగమంత్రి జైశంకర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
సైప్రస్ లో పర్యటిస్తున్న విదేశాంగమంత్రి జైశంకర్.. అక్కడి భారతీయుల్ని ఉద్దేశించి మాట్లాడారు. పొరుగుదేశాలైన పాకిస్తాన్, చైనాతో సంబంధాలు కోరుకుంటున్నా కీలక విషయాల్లో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని జైశంకర్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే భారత్ కంటే ఎక్కువగా ఏ దేశం కూడా తీవ్రవాదంతో బాధపడటం లేదన్నారు.

తీవ్రవాదాన్ని సాధారణీకరించే లేదా హేతుబద్దీకరించే అవకాశాలు ఏమాత్రం లేవని జైశంకర్ వెల్లడించారు. తాము పొరుగుదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కోరుకుంటున్నామంటే దానర్ధం వారి చేష్టల్ని క్షమిస్తున్నట్లు కాదన్నారు.
కోవిడ్ సమయంలో చైనాతో తలెత్తిన ఉద్రిక్తతలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని జైశంకర్ అంగీకరించారు. అరుణాచల్లోని తవాంగ్ సెక్టార్లో చైనా, భారత బలగాల ఘర్షణ జరిగిన కొద్ది రోజుల తర్వాత, కోవిడ్ సమయంలో సరిహద్దుల్లో సవాళ్లు తీవ్రమయ్యాయని జైశంకర్ తెలిపారు. చైనాతో సంబంధాలు సాధారణమైనవి కావని, ఎందుకంటే వాస్తవాధీన రేఖను ఏకపక్షంగా మార్చడానికి జరిగే ఏ ప్రయత్నాన్ని తాము అంగీకరించబోమన్నారు.సైప్రస్ లో తొలిసారి పర్యటిస్తున్న విదేశాంగమంత్రి ఇరుదేశాల మధ్య 60 ఏళ్ల బంధాన్ని గుర్తుచేసుకున్నారు.












Click it and Unblock the Notifications