విషాదం : కరోనాతో మరో ఎమ్మెల్యే కన్నుమూత... సంతాపం ప్రకటించిన ముఖ్యమంత్రి
బిహార్ మాజీ విద్యాశాఖ మంత్రి,జేడీయూ ఎమ్మెల్యే మేవాలాల్ చౌదరి కరోనాతో సోమవారం(ఏప్రిల్ 19) కన్నుమూశారు. గత వారం కరోనా బారిన పడిన ఆయన... పరాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4గంటలకు తుది శ్వాస విడిచారు.దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ పలువురు ప్రజాప్రతినిధులు కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.
మేవాలాల్ మృతి పట్ల ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యాదవ్ సంతాపం ప్రకటించారు. రాజకీయాల్లో ఆయన లేని లోటు పూడ్చలేనిది అని అభిప్రాయపడ్డారు. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేవాలాల్ జేడీయూ తరుపున తారాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నితీశ్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే అవినీతి ఆరోపణల కారణంగా... మంత్రి పదవి చేపట్టిన కొద్దిరోజులకే ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
బిహార్లో ప్రస్తుతం భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. మే 15 వరకూ విద్యా సంస్థలన్నీ మూసివేయాలని ఆదేశించింది. అలాగే అన్ని యూనివర్సిటీల పరిధిలోని పరీక్షలను వాయిదా వేసింది. ఇంతటి క్టిష్ట పరిస్థితుల్లోనూ వైద్య సేవలు అందిస్తున్న హెల్త్ కేర్ వర్కర్స్కి బిహార్ ప్రభుత్వం ఒక నెల వేతనాన్ని బోనస్గా ప్రకటించింది.
ప్రస్తుతం బిహార్లో44,700 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ మొత్తం 3,24,117 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం(ఏప్రిల్ 18) ఒక్కరోజే 8690 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అత్యధికంగా పాట్నా జిల్లాలో 2290,గయా 753,సరణ్ 383 కరోనా కేసులు నమోదయ్యాయి.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,722 మంది కరోనాతో మృతి చెందారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హెల్త్ కేర్ వ్యవస్థపై ఒత్తిడి తీవ్రమైంది. అన్ని రాష్ట్రాల్లో ఆస్పత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోయిన పరిస్థితి. కొన్నిచోట్ల ఆస్పత్రి బయటే పేషెంట్లకు చికిత్స అందిస్తున్న దుస్థితి నెలకొంది. ఇక ఆక్సిజన్,వెంటిలేటర్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నవారు... ప్రాణాలు కోల్పోతున్నవారు కూడా డజన్ల సంఖ్యలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని కేవలం 9 పరిశ్రమలకు మినహా మిగతా పరిశ్రమలన్నింటికీ ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఆక్సిజన్ సరఫరా తాత్కాలికంగా నిషేధించాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications