ఈ వయస్సులో నాకెవరు ఇస్తారు..!!
సంచలనాలకు కేంద్రబిందువు మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి. ఛత్రపతి శివాజీ మహరాజ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతరం ఆయనను తప్పించింది కేంద్రం. 2024 ఎన్నికల్లో లోక్ సభకు పోటీపై తాజాగా స్పందించారు.
న్యూఢిల్లీ: సంచలనాలకు కేంద్రబిందువు.. మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలను చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. మహారాష్ట్ర గవర్నర్ గా పని చేసినప్పుడు కూడా తన వైఖరిని మార్చుకోలేదు. ఏకంగా మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ పైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. ఆ వ్యాఖ్యలు అప్పట్లో దుమారాన్ని రేపాయి.

శివాజీపై..
మహారాష్ట్రీయులు గతంలో ఛత్రపతి శివాజీని తమ ఐకన్ గా భావించేవారని, ఇప్పుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఐకాన్ గా తీసుకుంటోన్నారనంటూ అప్పట్లో భగత్ సింగ్ కోష్యారి వ్యాఖ్యానించారు. ఇది రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. ఛత్రపతి శివాజీని కించపరిచారంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.

గవర్నర్ గా..
మహారాష్ట్రీయుల మనోభావాలను దెబ్బతీశారంటూ మండిపడ్డారు. కోష్యారిని రీకాల్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ఆయనను మహారాష్ట్ర గవర్నర్ హోదా నుంచి తప్పించింది. మహారాష్ట్ర గవర్నర్ గా రమేష్ బైస్ ను అపాయింట్ చేసింది. ఈ పరిణామాలన్నింటిపైనా తాజాగా భగత్ సింగ్ కోష్యారి స్పందించారు.

రాజకీయాలకు దూరం..
తనను తప్పించడానికి ముందే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశానని, క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వివరించానని కోష్యారి చెప్పారు. కేంద్రం, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అభివృద్ధికి కృషి చేస్తోన్నాయని ప్రశంసించారు. డబుల్ ఇంజిన్ సర్కార్.. తన సొంత రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో పరుగులు తీయిస్తోందని పేర్కొన్నారు.

రెండో పవర్ సెంటర్..
గతంలో ఉత్తరాఖండ్ యువత ఉపాధి అవకాశాల కోసం ముంబై, ఢిల్లీకి తరలి వెళ్లేవారని, ఇప్పుడు కూడా ఆ సమస్య ఉన్నప్పటికీ- కొంత తగ్గిందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ ప్రజలు స్వయం ఉపాధితో ముందుకు సాగేలా చూడాలనేదే తన ప్రయత్నమని కోష్యారి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తాను ఉత్తరాఖండ్ లో రెండో పవర్ సెంటర్ గా మారాలనే ఆలోచన కూడా లేదని అన్నారు.

ఎన్నికల్లో పోటీపై..
2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీపైనా కోష్యారి స్పందించారు. ఇప్పుడు తన వయస్సు 81 సంవత్సరాలని, ఎన్నికలు వచ్చేసరికి 82 సంవత్సరాలొస్తాయని, ఈ వయస్సులో తనకు టికెట్ ఇవ్వడానికి ఏ పార్టీ కూడా అంగీకరించదని అన్నారు. 2019 ఎన్నికల్లోనే తనకు టికెట్ లోక్ సభ టికెట్ ఇవ్వడానికి ప్రయత్నించగా తాను తిరస్కరించాననని అన్నారు.

అన్ని సభలనూ చూశా..
2024లో పోటీ చేసే ప్రసక్తే లేదని కోష్యారి తేల్చి చెప్పారు. లోక్ సభ, రాజ్యసభ, శాసన సభ.. ఇలా అన్నింటినీ చూశానని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కొత్తగా చేయడానికేమీ లేదని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి లేదని, అలాగే- రాష్ట్రంలో రెండో పవర్ సెంటర్ గా మారాలనే ఆశ లేదనీ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications