మతిలేని మాటలు మాట్లాడుతున్న రమ్య: ఎస్పీకి ఫిర్యాదు
బెంగళూరు: మాజీ ఎంపీ, బహుబాష నటి రమ్య మీద కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నాయకులు కర్ణాటకలోని మండ్య జిల్లా ఎస్పీకి రమ్య మీద ఫిర్యాదు చేశారు.
సమాజంలో చిచ్చురేపే విధంగా రమ్య మాట్లాడుతున్నారని, ఆమె మాటలు యువతను చెడగొట్టే విధంగా ఉన్నాయని బీజేపీ నాయకుడు, మారచాకనహళ్ళి పంచాయితీ అధ్యక్షుడు పుట్టస్వామి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
దేశభక్తి చాటుకుంటున్న ఆర్ఎస్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద రమ్య మతిలేకుండా ఆరోపణలు చేస్తున్నదని, ఇది సమాజంలో తప్పుడు సంకేతాలు తీసుకు వెళ్లే ప్రమాదం ఉందని పుట్టస్వామి అన్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న రమ్య మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు మండ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ స్వాతంత్రపోరాటం చెయ్యలేదని, కాంగ్రెస్ స్వాతంత్రం తీసుకువచ్చిందని రమ్య ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.