భారతరత్నాలు : ప్రణబ్కు అవార్డు అందజేసిన రాష్ట్రపతి కోవింద్, మరో ఇద్దరికీ కూడా..
హైదరాబాద్ : భారతరత్నాలకు అవార్డులను ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఈ ఏడాది భారత రత్న అవార్డులను ముగ్గురికి ప్రకటించిన సంగతి తెలిసిందే. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సరసత్వి శిశుమందిర్ వ్యవస్థాపకుడు నానాజీ దేశ్ముఖ్, సంగీత విద్వాంసుడు భూపేన్ హజారికాకు ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో వీరికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది.
రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భారతరత్న అవార్డు అందజేశారు. నానాజీ దేశ్ ముఖ్ తరఫున దీన్ దయాళ్ ఇన్ స్టిట్యూట్ చైర్మన్ వీరేంద్ర జిత్ సింగ్, భూపేన్ హజారికా తరఫున ఆయన కుమారుడు తేజ్ హజారికా అవార్డులను స్వీకరించారు. భారతరత్న అవార్డును మాజీ రాష్ట్రపతులు రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి స్వీకరించారు. ఆ వరుసలో ప్రణబ్ ముఖర్జీ చేరారు.

1935 డిసెంబర్ 11న పశ్చిమబెంగాల్లో జన్మించిన ప్రణబ్ ముఖర్జీ అంచెలంచెలుగా ఎదిగారు. ప్రథమ పౌరుడి స్థాయి వరకు చేరారు. ఎంఏ చేశాక న్యాయవాద వృత్తితో మక్కువతో ఎల్ఎల్బీ కూడా చేశారు. కోల్కతాలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో అప్పర్ డివిజన్ క్లర్క్గా పనిచేశారు. తర్వాత 1963లో లెక్చరర్గా కొద్దీరోజులు పనిచేశారు. తర్వాత జర్నలిస్టుగా కూడా పనిచేసి .. రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1969లో మిడ్నాపూర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వీకే కృష్ణ మీనన్ తరఫున ప్రచారం చేసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దృష్టిలో పడ్డారు. తర్వాత ఆమె ప్రణబ్ను ఆహ్వానించి పార్టీలోకి చేర్చుకున్నారు. 1969లో జూలైలో రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. 1973లో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో చేరి .. కేంద్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. 1984లో ఇందిర హత్య అనంతరం .. రాజీవ్ గాంధీకి ప్రధాని పదవీ దక్కడంతో రాష్ట్రీయ సమాజ్ వాదీ కాంగ్రెస్ పేరుతో పార్టీ స్థాపించి .. చివరకు 1989లో దానిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అలా కాంగ్రెస్లో మళ్లీ కీ రోల్ పోషించారు. 2012లో భారత రాష్ట్రపతిగా ఎన్నికై .. సమర్థంగా విధులు నిర్వర్తించారు.












Click it and Unblock the Notifications