ఇద్దరు ప్రొఫెసర్లపై ఎన్ఐఏ సంచలన చార్జిషీట్.. నేపాల్ మావో అగ్ర నేతతో టచ్..
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అగ్ర నేత సిగ్దల్ అలియాస్ వసంతతో గతంలో టచ్లో ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) తమ చార్జిషీట్లో పేర్కొంది. భీమా కోరెగావ్ అల్లర్లకు సంబంధించి ఈ నెల 9న ముంబైలోని స్పెషల్ ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో ఎన్ఐఏ అధికారులు ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 10వేల పేజీలతో కూడిన చార్జిషీట్ను ఎన్ఐఏ దాఖలు చేసింది.
ఎన్ఐఏ సంచలన చార్జిషీట్...
ప్రొఫెసర్ సాయిబాబా ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాల డిజిటల్ డేటా అనాలిసిస్లో ఒక డాక్యుమెంట్ లభ్యమైందని... అందులో నేపాల్ మావోయిస్ట్ అగ్ర నేత కామ్రేడ్ వసంత పేరును పేర్కొన్నారని ఎన్ఐఏ తమ చార్జిషీట్లో ఆరోపించింది. 'కుట్రకు కీలక సూత్రధారుల్లో ఒకరైన రోనా విల్సన్ ఆ డాక్యుమెంట్లో వసంత గురించి పేర్కొన్నారు. వసంతతో ఆయుధ కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాన్ని కామ్రేడ్ వరవరరావు డీల్ చేస్తారని అందులో చెప్పారు. రూ.8 కోట్లతో ఎం4 రైఫిల్స్తో పాటు 4లక్షల బుల్లెట్లను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం మణిపూర్ మావోయిస్టుల సహకారం కూడా తీసుకోవాలనుకున్నారు.' అని ఎన్ఐఏ వెల్లడించింది.
ఆ సంస్థల పేర్లు కూడా...
ప్రొఫెసర్ సాయిబాబా వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ డేటాలో రోనా విల్సన్కు సంబంధించిన ఒక ఫోటో కూడా ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల కంచుకోట అబూజ్ మడ్ దుండకారణ్యాన్ని సందర్శించిన సందర్భంలో విల్సన్ ఆ ఫోటో దిగినట్లు తెలిపింది. ఆయనతో పాటు మరో నిందితుడు రితుపన్ గోస్వామి అలియాస్ ప్రకాశ్ కూడా అక్కడికి వెళ్లినట్లు పేర్కొంది. అంతేకాదు,దేశంలోని రివల్యూషనరీ డెమోక్రాటిక్ ఫ్రంట్(RDF),ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్(IAPL),అనురాధ గాంధీ మెమోరియల్ కమిటీ(AGMC),కబీర్ కాలా మంచ్(KKM),కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్(CRPP),కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్(CPDR),పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్(PUDR) తదితర సంస్థలు మావోయిస్టు పార్టీ కోసం ఉపరితలంపై పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ ఆరోపించడం గమనార్హం.
మరో ప్రొఫెసర్ తేల్తుంబ్డేపై ఆరోపణలు...
భీమా కోరేగావ్ కేసులోనే అరెస్టయిన ఐఐటీ మాజీ ప్రొఫెసర్ కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్(CRPP)కు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారని... అనురాధ గాంధీ మెమోరియల్ కమిటీ(AGMC)లోనూ సభ్యుడిగా ఉన్నారని ఎన్ఐఏ ఆరోపించింది. భీమా కోరేగావ్ అల్లర్లకు డిసెంబర్ 31,2017న జరిగిన ఎల్గర్ పరిషత్ సమావేశంలో కుట్ర జరిగిందన్న ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి తేల్తుంబ్డే డిసెంబర్ 30,2017న గోవా నుంచి పుణేకి ప్రయాణం చేశారని... డిసెంబర్ 31,2017న ఆయన శనివార్ వాడలో ఉన్నట్లు ఆరోపించింది. అంతేకాదు,అంతర్జాతీయ స్థాయిలో మావోయిస్టు సంబంధాలు నెరిపేందుకు విద్యావేత్త ముసుగులో తేల్తుంంబ్డే కెనడా,పాకిస్తాన్,అమెరికా,ఫ్రాన్స్ తదితర దేశాలను సందర్శించారని ఆరోపించింది.
మావోయిస్టులతో తేల్తుంబ్డే సంబంధాలు?
తేల్తుంబ్డే తన విదేశీ పర్యటనల సందర్భంగా అంతర్జాతీయ కమ్యూనిస్ట్ సంస్థలతో మావోయిస్టు పార్టీ వ్యూహాలు,సాహిత్య భావజాలాన్ని పంచుకున్నారని ఎన్ఐఏ ఆరోపించింది. అంతేకాదు,మావోయిస్టు పార్టీ సూచనల మేరకు పలు నిజ నిర్దారణ కమిటీల్లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారని ఆరోపించింది. భీమా కోరేగావ్ అల్లర్లలో ఆయన పోషించిన పాత్రను మావోయిస్టు పార్టీ అభినందించినట్లుగా విచారణలో వెల్లడైందని పేర్కొంది. తేల్తుంబ్డేతో పాటు మరో ఏడుగురిపై కూడా ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది.