కొనసాగుతున్న దీదీ దీక్ష.. ఫుల్ సపోర్ట్.. నిరసనలకు తృణమూల్ రెడీ
కోల్కతా : ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య వార్ మరింత ముదిరింది. ఆదివారం నాటి పరిణామాలతో దీదీ మరింత గుర్రుగా ఉన్నారు. కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే మమతా వ్యాఖ్యలకు.. పలువురు నేతల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో మోడీ వర్సెస్ దీదీ రాజకీయం ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీ కూడా అక్కడే..!
కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. రాజ్యాంగ పరిరక్షణ దీక్ష పేరిట దీదీ చేపట్టిన దీక్షకు పలువురు నేతలు సంఘీభావం ప్రకటించారు. కోల్కతాలోని మెట్రో ఛానెల్ ఎదుట కొనసాగుతున్న మమతా దీక్షకు మద్దతుగా తృణమూల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కూడా దీక్షా స్థలంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు దీదీ. కేంద్రంపై గుర్రుగా ఉన్న మమతా బెనర్జీ.. తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దమ్ముంటే రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ సవాల్ విసిరారు. సీబీఐని అజిత్ దోవల్ నడిపిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ఆడించినట్లు అజిత్ దోవల్ తల ఊపుతున్నారంటూ ఘాటుగా విమర్శించారు.
దీదీకి ఫుల్ సపోర్ట్
కేంద్రంపై పోరుబాట పట్టిన మమతాబెనర్జీకి అనూహ్య మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దీదీకి ఫోన్ చేశారు. పూర్తిస్థాయిలో అండగా ఉంటామని మద్దతు ప్రకటించారు. దేవెగౌడ, స్టాలిన్, తేజస్వి యాదవ్, ఓమర్ అబ్దుల్లా తదితర నేతలు మమతాతో ఫోన్లో మాట్లాడారు. దీదీ దీక్షకు సంఘీభావం తెలిపారు. మరోవైపు కేంద్రం చర్యలను ఖండిస్తూ తృణమూల్ శ్రేణులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని డిసైడ్ అయ్యారు.
కేంద్రం వర్సెస్ దీదీ
చిట్ఫండ్ స్కామ్ లకు సంబంధించిన కేసులో కేంద్రానికి, పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి మధ్య వార్ ముదిరింది. దర్యాప్తులో భాగంగా కోల్కతా నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను ప్రశ్నించడానికి సీబీఐ అధికారులు రాష్ట్రానికి వచ్చారు. ఆ నేపథ్యంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో దుమారం రేగింది. అంతేకాదు సీబీఐ అధికారులను బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడం వివాదస్పదమైంది. అది అలా జరుగుతుండగానే మరోవైపు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కమిషనర్ ఇంటికి సీబీఐ అధికారులు వచ్చారనే సమాచారంతో మమతా బెనర్జీ అలర్టయ్యారు. సీపీకి మద్దతు ప్రకటించిన దీదీ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కేంద్రం వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ధర్నాకు దిగారు.