నేడు కోర్టుకు గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్, జైల్లో మాజీ మంత్రి, ఆంబిడెంట్ స్కాం కేసు!
Recommended Video
బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ మంగళవారం జరగనుంది. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడానికి ఆయన న్యాయవాదులు అన్ని సిద్దం చేశారు.
ఈడీలో నమోదు అయిన ఆంబిడెంట్ నిర్వహకులు కేసులు మాఫీ చేయించడానికి రూ. 20 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ ఫైవ్ స్టార్ హోటల్ ఈ డీల్ జరిగిందని సీసీబీ పోలీసులు ఆరోపణలు చేస్తున్నారు.
ఆంబిడెంట్ కంపెనీ డీల్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని గాలి జనార్దన్ రెడ్డి అంటున్నారు. తనను ఓ కార్యక్రమానికి ఆహ్వానించడానికి ఆంబిడెంట్ నిర్వహకులు హోటల్ కు వచ్చిన సమయంలో తీసుకున్న ఫోటోలు, వీడియోలు అడ్డం పెట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి అంటున్నారు.
విచారణ పేరుతో గాలి జనార్దన్ రెడ్డిని పిలిపించిన సీసీబీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో గాలి జనార్దన్ రెడ్డి విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు.
కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ఆకస్మిక మరణంతో సోమవారం కోర్టులకు సెలవు ప్రకటించారు. మంగళవారం గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కోర్టులో సమర్పించడానికి ఆయన న్యాయవాదులు సిద్దం అయ్యారు. ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసుతో గాలి జనార్దన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆయన న్యాయవాదులు కోర్టులో వాదించడానికి సిద్దం అయ్యారు.