చైనాకు ‘గల్వాన్’ దెబ్బ: 43 శాతం మంది డ్రాగన్ ఉత్పత్తులకు దూరం, పండగ సీజన్లోనూ అంతే
న్యూఢిల్లీ: భారత్పై దుస్సాహసానికి ఒడిగట్టిన చైనా భారీ మూల్యమే చెల్లించుకుంది. గల్వాన్ లోయలో భారత సైనికులపై చైనా బలగాలు దాడి చేసిన విషయం తెలిసిందే. మన దేశ సైనికులు కూడా చైనాకు తగినగుణపాఠం చెప్పారు. అయితే, గల్వాన్ లోయలో భారతీయ సైనికులపై చైనా దళాలు దాడిచేసిన తర్వాత నుంచి భారతీయ వీనియోగదారులు భారీ మార్పు వచ్చింది.
చైనా ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాల వేట..
చాలా మంది చైనా తయారీ వస్తువులకు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గుచూపుతున్నారు. గతంలో చైనా వస్తువులను విరివిగా కొనుగోలు చేసిన వారు కూడా ఇప్పుడు ఆ దేశ ఉత్పత్తులపై ఆసక్తి చూపడం లేదు. ఇటీవల ఓ కమ్యూనిటీ సోషల్ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
43శాతం మంది భారతీయులు చైనా ఉత్పత్తులకు దూరం..
లోకల్ సర్కిల్ అనే కమ్యూనిటీ సోషల్ మీడియా సంస్థ ఈ సర్వే నిర్వహించింది. గత 12 నెలల్లో చైనా వస్తువుల కొనుగోళ్లు విషయంలో భారతీయులు ఆసక్తి చూపడం లేదని ఆ సర్వేలో తేంది. 43 శాతం మంది భారతీయులు చైనాలో తయారైన వస్తువులను కొనుగోలు చేయలేదని ఈ సర్వేలో వెల్లడైంది. గతంలో ఆ వస్తువులు ఎక్కువగా కొన్నవారు కూడా గత కొంతకాలంగా బాగా తగ్గించినట్లు తెలిపింది.
బాయ్కాట్ చైనా.. కొనుగోళ్లు పూర్తిగా తగ్గించిన భారతీయులు
గల్వాన్ దాడి ఘటన అనంతరం మనదేశంలో 'బాయ్కాట్ చైనా' అనే నినాదం ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వినియోగదారులు చైనా తయారు చేసిన ఉత్పత్తులను కొనడం పూర్తిగా తగ్గించారు. చైనా ఉత్పత్తులకు బదులు ఇతర దేశాల ఉత్పత్తులవైపు మళ్లారు. మరోవైపు, భారత ప్రభుత్వం కూడా టిక్టాక్, హలో, అలీఎక్స్ ప్రెస్ వంటి 200కుపైగా చైనా యాప్స్ను నిషేధించడం కూడా కొనుగోలుదారుల ఆసక్తులను మళ్లించింది.
71 శాతం మంది భారతీయులు చైనా ఉత్పత్తులను కొనడం మానేశారు..
గత నవంబర్ నెలలో పండగ సీజన్ అయినప్పటికీ.. 71 శాతం మంది ప్రజలు చైనా వస్తువులను కొనుగోలు చేయలేదని లోకల్ సర్కిల్ సర్వే స్పష్టం చేసింది. ధర తక్కువ ఉండటం, సరైన ప్రత్యామ్నాయం అందుబాటులో లేకపోవడంతో చైనా ఉత్పత్తులను కొనక తప్పడం లేదని మరికొందరు పేర్కొన్నట్లు తెలిపింది. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించగా, అంతకు రెట్టింపు మరణాలు చైనా వైపు జరిగినట్లు సమాచారం.