ముస్లింను ఇండియా కెప్టెన్ చేశాం.. సిగ్గుపడు పాకిస్తాన్.. కనేరియా ఉదంతంపై గంభీర్ తీవ్ర స్పందన
''వందకోట్ల మందికిపైగా భారతీయులకు ప్రాతినిధ్యవ వహించే జాతీయ క్రికెట్ జట్టులో అందరం ఒక్కటిగా ఆడాం. అజారుద్దీన్ లాంటి మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి కెప్టెన్ గా వ్యవహరించారు. అదిరా ఇండియా గొప్పదనం. మరి మీరూ? టీమ్ లో ఒక్కగానొక్క హిందువును వేధించుకుతిన్నారు.. పైగా ఇప్పుడు మీ దేశానికి ఓ మాజీ క్రికెటరే ప్రధానిగా ఉన్నాడు.. సిగ్గుపడు పాకిస్తాన్.. ఇదే నీ అసలు రంగు ఇదే..'' అంటూ తీవ్రస్థాయిలో రియాక్టయ్యాడు మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్.
క్రికెట్ వర్గాల్లోనూ అలజడి..
ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ క్రికెట్ జట్టులో.. కేవలం హిందువైన కారణంగా స్పిన్నర్ దానిష్ కనేరియా ఎలా వివక్ష ఎదుర్కొన్నాడో ఇటీవల వెలుగులోకి రావడం తెలిసిందే. మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఈమధ్యే పీటీవీ స్పోర్ట్స్ 'గేమ్ ఆన్ హాయ్' కార్యక్రమంలో మాట్లాడుతూ.. కనేరియా ఉదంతాన్ని గుర్తుచేశాడు. దీనిపై క్రికెట్ వర్గాల్లోనూ తీవ్రచర్చ జరిగింది.
మైనార్టీలపై హింస..
పొరుగుదేశాల్లో హిందూ, ఇతర మైనార్టీలపై దాడులు, వివక్ష చర్చనీయాంశమవుతున్న సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావడం, తద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మతపరమైన వివక్ష ఎదుర్కొనే మైనార్టీలకు ఇండియా పౌరసత్వం కల్పించడం తదితర పరిణామాల నేపథ్యంలో గంభీర్ రియాక్షన్ ప్రాధాన్యం సంతరించుకుంది.
అక్తర్ ఏం చెప్పాడంటే..
పాక్ జాతీయ జట్టులో ప్రాంతీయత, మత వివక్ష గురించి మాట్లాడుతూ అక్తర్.. కనేరియా ఉదంతాన్ని వెల్లడించాడు. కనేరియా అద్బుతమైన స్పిన్ బౌలింగ్ వల్లే పాక్ టీమ్ ఎన్నో సిరీస్ లు గెల్చుకున్నా, అతనికి క్రెడిట్ దక్కనివ్వలేదని, కేవలం హిందువు అయినందుకే కనేరియాను తక్కువచేసి చూసేవాళ్లని అక్తర్ గుర్తుచేశాడు. తనకు జరిగిన అన్యాయంపై త్వరలోనే స్పందిస్తానని, పేర్లు కూడా బయటపెడతానని కనేరియా చెప్పడం గమనార్హం.