జైలు కెళ్లడానికి సిద్ధంగా ఉండండి: కేజ్రీకి బీజేపీ సూచన
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం కేసులో కేజ్రీవాల్ జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ సూచించారు.
రాజ్యాంగ విరుద్ధమైన పనులను సీఎం కేజ్రీవాల్ ఒకదాని తరువాత మరొకటి చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీ నేతలపై విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు.
అరవింద్ కేజ్రీవాల్, ఆయన అనుచరులు డీడీసీఏ విషయంలో తీసుకున్నటువంటి రాజ్యాంగేతర నిర్ణయాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. కాగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి సంబంధం ఉందని చెబుతున్న ఈ ఆర్థిక అవకతవకల వ్యవహారంపై ఆప్ ప్రభుత్వం వేసిన దర్యాప్తు కమిషన్ను ‘అక్రమం, రాజ్యాంగ విరుద్ధం' అంటూ కేంద్రం కొట్టివేసింది.
దీనిపై మండిపడ్డ కేజీవాల్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ దర్యాప్తును ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. డీడీసీఏ వ్యవహారాలపై దర్యాప్తుకు ఆదేశిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను ఎలాంటి చట్టబద్ధతా లేదని కేంద్ర హోంశాఖ పేర్కొన్నట్టుగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఓ లేఖలో స్పష్టం చేయడంతో తాజాగా వివాదం రాజుకుంది.
చట్టం, రాజ్యాంగం ప్రకారమే దర్యాప్తు కమిషన్ను ఏర్పాటు చేశామని, కేంద్ర ప్రభుత్వం దీన్ని చట్ట విరుద్ధమని చెప్పినా తాము వెనక్కి వెళ్లేది లేదని కేజ్రీవాల్ ఉద్ఘాటించారు. దర్యాప్తు కమిషన్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే కోర్టును ఆశ్రయించాలని లెఫ్టినెంట్ గవర్నర్కు, కేంద్ర హోం శాఖకూ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే డిడిసిఎ అవకతవకలపై దర్యాప్తు కమిషన్ను వేశామని, దీనిపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడాల్సిన అవసరం ఏమీ లేదని అన్నారు. కేవలం కోర్టు ద్వారా జారీ అయ్యే ఆదేశాలు మాత్రమే కమిషన్ను నిరోధించగలుగుతాయని కేజ్రీవాల్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.