కండక్టర్ వేధింపులు: బస్సులోంచి దూకేసిన బాలిక
పలన్పూర్: దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేదని తాజా ఘటనతో మరోసారి రుజువైంది. తల్లిదండ్రులు తమ కూతురిని స్కూల్కు పంపించాలంటే ఎంతో భయపడిపోతున్నారు. మరికొందరు తల్లిదండ్రులు కూతరిపై ఉన్న నమ్మకంతో బస్సుల్లో పంపిస్తున్నారు.
అయితే బస్సుల్లో రక్షణగా నిలవాల్సిన కండక్టరే ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన గుజరాత్లోని మెహసానా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మెహసానా జిల్లాలోని పటియా గ్రామానికి చెందిన ఓ బాలిక (14) కేరాలు మండలంలోని స్కూల్లో 9వ తరగతి చదువుతోంది.
ఎప్పటిలాగే సోమవారం కూడా హలాల్-వాద్నగర్ మధ్య ప్రభుత్వం నడుపుతున్న బస్లో స్కూల్కు బయల్దేరింది. అయితే బస్సులోకి ఎక్కి విండో సీటు పక్కనే కూర్చున్న ఆ బాలిక పట్ల బస్సు కండెక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. తన పక్కనే కూర్చునేందుకు ప్రయత్నించడంతో పాటు ఆ బాలిక శరీరంపై ఎక్కడెక్కడో చేతులు వేయబోయాడు.
దీంతో భయపడిన ఆ బాలిక బస్సులో నుంచి కిందకు దూకేసింది. అయితే బాలిక కిందకు దూకిన సమయంలో బస్సు నెమ్మెదిగా వెళుతుండటంతో బాలికకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. దీంతో గాయపడ్డ బాలికను ఆమె తల్లిదండ్రులు సమీప ఆసుపత్రిలో చేర్చింపి చికిత్సను అందించారు. అనంతరం బాలిక కోలుకున్న తర్వాత ఆమె తల్లిదండ్రులు బస్సు కండెక్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే సంఘటన జరిగిన సమయంలో బస్సులో కేవలం ఇద్దరు ప్రయాణికులే ఉన్నారని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు కండెక్టర్ను ఈశ్వర్ భాయ్ పార్మర్ (49)గా గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. అతడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.