మహారాష్ట్రలో భయంకరంగా కోవిడ్.. 'ఆస్పత్రిలో చేర్చుకోండి.. లేదా చంపేయండి' ఓ కోవిడ్ పేషెంట్ కుమారుడి ఆవేదన...
మహారాష్ట్రలో కరోనా పరిస్థితులు అత్యంత భయంగొల్పేలా కనిపిస్తున్నాయి. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ఆస్పత్రులపై విపరీతమైన ఒత్తిడి నెలకొంది. వందల సంఖ్యలో వస్తున్న పేషెంట్లకు ఆస్పత్రుల్లో పడకలు దొరకట్లేదు. దీంతో ఆస్పత్రి ఆవరణలోనే గంటల కొద్ది నిరీక్షించాల్సి వస్తోంది. ఈలోగా పరిస్థితి విషమిస్తే ఏంటి పరిస్థితి అన్న ఆందోళన.. కరోనా పేషెంట్ల కుటుంబ సభ్యుల్లో వ్యక్తమవుతోంది. తాజాగా చంద్రపూర్కి చెందిన ఓ వ్యక్తి కరోనా బారినపడ్డ తన తండ్రిని ఆస్పత్రిలో చేర్చేందుకు 24 గంటలకు పైగా పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగి తిరిగాడు. అయినా లాభం లేకపోవడంతో... 'ఇస్తే ఆస్పత్రిలో బెడ్ ఇవ్వండి.. లేదా ఒక ఇంజెక్షన్తో ఆయన ప్రాణాలు తీయండి..' అని అతను వాపోవడం గమనార్హం.
అసలేం జరిగింది...
మహారాష్ట్ర రాజధానికి చంద్రపూర్ జిల్లా కేంద్రం 850కి.మీ దూరంలో ఉంటుంది. చంద్రపూర్కి 60-70కి.మీ పరిధిలోనే తెలంగాణ జిల్లాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో చాలామంది ప్రజలు చంద్రపూర్లో వైద్యం అందకపోతే తెలంగాణ వైపు వస్తుంటారు.
ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో చంద్రపూర్లో ఆస్పత్రులన్నీ ఇప్పటికే నిండిపోయాయి. తాజాగా చంద్రపూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి... కోవిడ్ సోకిన తన తండ్రిని ఆస్పత్రిలో చేర్చేందుకు తీసుకెళ్లాడు. మొదట వరోరా ఆస్పత్రికి,అక్కడి నుంచి మరో ప్రభుత్వ ఆస్పత్రికి,ఆ తర్వాత ప్రైవేట్ ఆస్పత్రులకు... ఇలా తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఎక్కడా ఏ ఆస్పత్రిలో అతని తండ్రిని చేర్చుకోలేదు.
చంద్రపూర్ నుంచి తెలంగాణకు...
అప్పటికే చీకటి పడిపోయింది. అయినా సరే... పొరుగునే ఉన్న తెలంగాణకు వెళ్లి ప్రయత్నిద్దామనుకున్నారు. రాత్రి 1.30గంటల సమయంలో చంద్రపూర్ నుంచి బయలుదేరి 3గంటల సమయంలో తెలంగాణకు చేరుకున్నారు. కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఎక్కడా పడకలు ఖాళీగా లేవు. ఇక చేసేదేమీ లేక మళ్లీ చంద్రపూర్కే వెళ్లిపోయారు. చంద్రపూర్లోని ఓ ఆస్పత్రి బయట మళ్లీ అవే పడిగాపులు... ఇంతలో ఓ జాతీయ మీడియా అక్కడికి వెళ్లి పేషెంట్ల కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేసింది.
'ఆస్పత్రిలో చేర్చుకోండి లేదా చంపేయండి...'
ఈ క్రమంలో ఆ వ్యక్తితో మీడియా ప్రతినిధులు మాట్లాడగా... 'నా తండ్రికి అమర్చిన ఆక్సిజన్ ఇక అయిపోవచ్చింది. ఇకనైనా ఆయన్ను ఆస్పత్రిలో చేర్చుకోండి... లేదా మీరే ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆయన ప్రాణాలు తీయండి...' అంటూ అతను వాపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ను మళ్లీ ఇంటికి తీసుకెళ్లి... ఆయన అనారోగ్యంతో బాధపడుతుంటే చూడలేమని చెప్పాడు. 24గంటల వ్యవధిలో ఇటు మహారాష్ట్ర,అటు తెలంగాణల్లో వైద్యం కోసం ప్రయత్నించామని... కానీ ఎక్కడా ఏ ఆస్పత్రిలో పడకలు ఖాళీగా లేవని చెప్పుకొచ్చాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కష్టమని వాపోయాడు.
భయంకరంగా కోవిడ్ వేవ్...
మహారాష్ట్రలో కోవిడ్ సెకండ్ వేవ్ భయంకరంగా విజృంభిస్తోంది. ప్రతీరోజూ 50వేల పైచిలుకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. మే 1 వరకూ 15 రోజుల పాటు రాష్ట్రంలో ఈ కర్ఫ్యూ కొనసాగనుంది. కేవలం అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలన్నీ మూసివేయాల్సిందే.
ఈ నేపథ్యంలో వలస కార్మికులు మళ్లీ స్వస్థలాల బాట పట్టారు. వేలాదిగా రైల్వే స్టేషన్లకు పోటెత్తుతున్నారు. వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లేమీ చేయకపోవడంతో గతేడాది కనిపించిన దృశ్యాలే ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయి. రైల్వే స్టేషన్ల ఎదుట వారు బారులు తీరి కనిపిస్తున్నారు. జనం వేల సంఖ్యలో రైల్వే స్టేషన్లకు వస్తుండటంతో కరోనా వ్యాప్తి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.