Goa Elections 2022 : ఇక్కడ ఎవరు గెలిస్తే - ఢిల్లీలోనూ వారిదే పీఠం : చరిత్ర చెబుతున్న నిజాలు..!!
గోవా ఎన్నికలతో సెంటిమెంట్ ముడిపడి ఉంది. గోవాలో ఎవరు అధికారంలోకి వస్తే..అదే పార్టీ కేంద్రంలో అధికారం దక్కించుకుంటుంది. గత మూడు ఎన్నికలు ఇదే విషయాన్ని రుజువు చేసాయి. మరి కొద్ది నెలల్లో గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో..ఇప్పుడు ఈ సెంటిమెంట్ మరోసారి తెర మీదకు వచ్చింది. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవా అసెంబ్లీలో 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలుపొందింది. దీంతో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా నిలిచింది.
కానీ, 13 స్థానాల్లో గెలిచిన భాజపా మాత్రం ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం చోటుచేసుకున్న పార్టీ ఫిరాయింపులు, రాజీనామాలతో ప్రస్తుతం కాంగ్రెస్ బలం నాలుగుకు దిగజారింది. ఈ మధ్యే కాంగ్రెస్ సీనియర్ నేత, గోవా మాజీ ముఖ్యమంత్రి లుజినో ఫలైరో కాంగ్రెస్ను వీడి తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. ఈసారి గోవా ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాకు దీటుగా తృణమూల్, ఆమ్ఆద్మీ పార్టీలు గట్టి పోటీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
2007లో గోవాలో కాంగ్రెస్ గెలిచింది. అనంతరం 2009లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2012లో కాంగ్రెస్ గోవాలో ఓడిపోయింది. 2014లో కేంద్రంలో అధికారం కోల్పోయింది. 2017లోనూ కాంగ్రెస్ రాష్ట్రంలో ఓడిపోయింది. తర్వాత 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడి కేంద్రంలో వరుసగా రెండో సారి ప్రధానిగా మోదీ అధికారంలోకి వచ్చారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం సైతం అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీ గోవా ఎలక్షన్ ఇంఛార్జీగా ఉన్న ఆయన.. పనాజీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
మరి కొద్ది నెలల్లో జరిగే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్దేనని.. దాంతో 2024లో దిల్లీలోనూ గెలుపు మాదేనని చిదంబరం ఆశాభావం వ్యక్తం చేశారు. గోవాలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి అభివృద్ధిని గుర్తుచేసుకోవాలని.. 2022 నుంచి మళ్లీ గోవాలో స్వర్ణయుగం ఆరంభం అవుతుందని అన్నారు. గోవాకు చెందిన వారి చేతిలోనే గోవా పాలన నడుస్తుందనే నినాదాన్ని ఆయన ప్రజలకు గుర్తు చేసారు. ఈ సారి గోవా పైన టీఎంసీ తో పాటుగా ఆప్ సైతం ఆశలు పెట్టుకుంది.