గోవాకు పొంచి ఉన్న 'ఉగ్ర' ముప్పు: ఇంటలిజెన్స్ రిపోర్టుతో హైఅలర్ట్..
పనాజి: గోవాపై ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశాలు ఉన్నాయని శుక్రవారం భారత ఇంటలిజెన్స్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పశ్చిమ తీర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్టు తమకు సమాచారం అందిందని గోవా ఓడ రేవుల మంత్రి జయేష్ సాల్గోవాంకర్ తెలిపారు.
మత్య్సకారులు ఉపయోగించే బోటు ద్వారా ఉగ్రవాదులు గోవాలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గోవా తీరంలోని తీరంలో క్యాసినోలు, వాటర్ స్పోర్ట్స్ ఆపరేటర్లను అప్రమత్తం చేశామన్నారు.

ఇది కేవలం గోవాకే పరిమితం కాదని, ముంబై, గుజరాత్ తీర ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశామని జయేష్ వెల్లడించారు. పాకిస్తాన్ సీజ్ చేసిన భారత మత్స్యకారుల బోటు ఒకటి ఇటీవల వారి చెర నుంచి విడుదలైందని, ఇండియాకు వచ్చే ఆ బోటులో ఉగ్రవాదులు కూడా వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
కేసినోస్, వాటర్ స్పోర్ట్స్, ఇతరత్రా టూరిజం సిబ్బంది కూడా ఈ అలర్ట్ను ధ్రువీకరించారు. గోవాలో అసాంఘీక శక్తులు చొరబడే అవకాశం ఉండటంతో.. అంతా అప్రమత్తంగా ఉండాలని తమకు లేఖలు అందినట్టు తెలిపారు. గోవా అంతటా ఇప్పటికే సెక్యూరిటీని అలర్ట్ చేశారని వెల్లడించారు.


Click it and Unblock the Notifications