కలత: అనంతపద్మనాభస్వామి ఆలయంపై సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయానికి భక్తులు విరాళంగా సమర్పించిన పెద్ద మొత్తం బంగారం, వెండి వివరాలను ట్రస్టీలు తెలియజేయలేదని సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక తెలిపింది. ఈ నివేదిక, ఇతర నివేదకలను చూస్తే కలత చెందే విధంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించి తాము జోక్యం చేసుకుంటామని కూడా సుప్రీంకోర్టు తెలిపింది.
2011 జులైలో అనంతపద్మనాభస్వామి ఆలయం కోశాగారంలో బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు బయటపడ్డాయి. శతాబ్దాలుగా ఆలయం కోశాగారంలో అవి ఉన్నట్లు తేలింది. తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయం సంపద నిర్వహణలో లోపాలు ఉన్నాయని ప్రముఖ న్యాయవాది గోపాల్ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు.

విలువైన వాటిని ఆలయం నుంచి తరలిస్తున్నారంటూ దాఖలైన ప్రజాప్రయోజనాల (పిల్)ను పరిగణనలోకి తీసుకుని అంచనా వేయడానికి సుప్రీంకోర్టు సుబ్రమణ్యాన్ని నియమించింది. భక్తులు సమర్పించిన కానుకలను లెక్క వేయలేదని సుబ్రమణ్యం తన నివేదికలో తెలిపారు.
అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని ట్రావంకోర్ పాలకులు నిర్మించి, నిర్వహిస్తూ వచ్చారు. రాచకుటుంబం అధిపతి ఆధీనంలోనే ఇప్పటికీ ఆలయ నిర్వహణ ఉంది. కేరళలోని మిగతా ఆలయాలను మాత్రం ప్రభుత్వం నిర్వహిస్తుంది.












Click it and Unblock the Notifications