ఎమ్మెల్యే పాదాలు తాకిన కిరణ్ బేడీ ఫోటో వైరల్, గవర్నర్గా ఆసక్తికర నిర్ణయం
పుదుచ్చేరి: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే కాళ్లు మొక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళ్లు పట్టుకోవడానికి కారణం ఉంది.
ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన మహిళా ప్రజాప్రతినిధి విజయవేణి మర్యాదపూర్వకంగా కిరణ్ బేడీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్ బేడీకి శాలువా కప్పి పాదాభివందనం చేశారు. దీంతో, కిరణ్ బేడీ అవాక్కయ్యారు.
సదరు మహిళా ఎమ్మెల్యేను లేవదీసి, కాళ్లు పట్టుకోవద్దని చెప్పారు. ఆత్మగౌరవంతో బతకాలని, ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆ తర్వాత, ప్రతిగా సదరు మహిళా ఎమ్మెల్యేకు పాదాభివందనం చేశారు. దీంతో మహిళా ఎమ్మెల్యేతో పాటు అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
సైరన్లు నిషేధించిన కిరణ్ బేడీ
పుదుచ్చేరిలో అగ్నిమాపక శకటాలు, అంబులెన్సులు మినహా ఏ ఇతర వాహనాలూ సైరన్ మోతల్ని వినియోగించడానికి వీల్లేకుండా నిషేధం విధించారు. తన వాహన శ్రేణిలోని ఎస్కార్ట్, పైలట్ వాహనాలకూ ఇది వర్తిస్తుందని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రకటించారు.
సోమవారం బాధ్యతలు చేపట్టిన నూతన ముఖ్యమంత్రి వి నారాయణస్వామి దీనిని సమర్థించారు. బేడీ 'సూపర్ సీఎం' కావాలనుకుంటున్నారా అని విలేకరులు ప్రశ్నించగా... ఆమెదీ, తనదీ ఒకే ఉద్దేశమని ముఖ్యమంత్రి విలేకరులకు సమాధానం ఇచ్చారు.