జమ్మూకాశ్మీర్లో గవర్నర్ పాలన: రాష్ట్రపతికి ఎన్ఎన్ వోహ్రా సిఫార్సు
Recommended Video
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో గవర్నర్ పాలన(రాష్ట్రపతి పాలన) విధించాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా రాష్ట్రపతికి నివేదించారు. సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చెయ్యడంతో ఆయన ఈ నివేదికను పంపించారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు విముఖత చూపించడంతో పాటు, పీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధంగా లేమని ఆ పార్టీలు స్పష్టం చేశాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మూకాశ్మీర్ గవర్నర్ను కోరారు. అన్ని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో సెక్షన్ 92 కింద గవర్నరు పాలన విధించాల్సిందిగా వోహ్రా రాష్ట్రపతికి నివేదిక పంపించారు.
కాగా, జమ్మూకాశ్మీర్లో గవర్నర్ పాలన(రాష్ట్రపతి పాలన) విధించడం ఇది ఎనిమిదో సారి. 1977, మే 26న తొలిసారిగా కాశ్మీర్లో గవర్నర్ పాలన విధించారు. 105 రోజుల పాటు కొనసాగింది. నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన షేక్ మహ్మద్ అబ్దుల్లా ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకోవడంతో గవర్నరు పాలన విధించారు.
అనంతరం 1986 మార్చి 6 లో రెండో సారి గవర్నరు పాలన విధించారు. 246 రోజుల పాటు ఇది కొనసాగింది. ఆ తర్వాత 1990లో మూడో సారి, 1996లో నాలుగో సారి, 2002లో ఐదో సారి, 2008లో ఆరోసారి, 2015లో ఏడోసారి గవర్నరు పాలన విధించారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడం, ఆ వెంటనే ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయడంతో మరోసారి గవర్నర్ పాలన విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ప్రస్తుతం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ విదేశీ పర్యటనలో ఉన్నారు.