మోడీ తర్వాతి దెబ్బ బంగారంపైనేనా? : ఆంక్షలు విధిస్తారా?
దేశ ప్రజల్లో మూడో వంతు మంది బంగారాన్ని బ్లాక్ మనీతోనే కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో.. గృహ వినియోగానికి సంబంధించిన బంగారం నిల్వలపై కేంద్రం ఆంక్షలు విధించే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది.
న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రైక్స్.. ఆ వెను వెంటనే పెద్ద నోట్ల రద్దు.. ఇలా సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న ప్రధాని నరేంద్ర మోడీ.. త్వరలోనే మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా! ఈ సారి దెబ్బ బంగారంపై పడనుందా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశానికి భారీ మొత్తంలో బంగారం దిగుమతి అయింది. గృహ వినియోగానికి సంబంధించిన బంగారం నిల్వలపై కేంద్రం ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో.. బంగారం వ్యాపారులు అప్రమత్తమయ్యారు. దీంతో భారీ మొత్తంలో రెండేళ్ళ గరిష్ఠ స్థాయికి బంగారాన్ని దిగుమతి చేసుకున్నారు.
కాగా, దేశ ప్రజల్లో మూడో వంతు మంది బంగారాన్ని బ్లాక్ మనీతోనే కొనుగోలు చేస్తున్నారు. అధికారిక లెక్కల్లో పరిగణలోకి రాని డబ్బుతోనే బంగారం కొనుగోళ్లు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇళ్లలో నిల్వ ఉంచుకునే బంగారంపై ఆంక్షలు విధించాలని యోచనలో మోడీ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందనే దానిపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. కాగా, పెద్ద నోట్ల రద్దుతో ప్రస్తుతం పాత బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య సగానికి పడిపోయింది.