చలించాను: వాళ్ల పిల్లలను చదివిస్తానని ముందుకొచ్చిన గుజరాత్ వ్యాపారి
గాంధీ నగర్: జమ్మూ కాశ్మీర్లోని యూరీ సెక్టార్ లో సైనిక శిబిరంపై పాక్ ఉగ్రవాదులు జరిపిన ఉగ్రదాడిలో 18 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఆర్మీపై ఈ మధ్య కాలంలో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి ఇదే.
ఈ ఉగ్రదాడిలో అమరవీరుల పిల్లలను తాను చదివిస్తానంటూ ముందుకొచ్చారు గుజరాత్కి చెందిన ఓ బిజినెస్ మ్యాన్. సూరత్కు చెందిన 47 ఏళ్ల మహేశ్ సవానీ యూరీ ఉగ్రదాడిలో వీరమరణం పొంది 18 మంది సైనికుల పిల్లలకు ఉచితంగా చదవు చెప్పిస్తానని ముందుకొచ్చాడు.
తాను ఈ నిర్ణయం తీసుకోడానికి గల కారణాన్ని కూడా ఆయన వివరించాడు. ఉగ్రదాడిలో చనిపోయిన ఓ జవాను కుమార్తె తండ్రి చనిపోయిన బాధతో కన్నీరుమున్నీరవుతూ నాన్న తనని బాగా చదువుకోవాలని జీవితంలో పైకి ఎదగాలని చెప్పాడని ఆ చిన్నారి చెప్తుంటే మనసు చలించిందని అన్నారు.
అందుకే ఆ పిల్లలందరికీ తననడుపుతున్న పీపీ సవానీ ఇంటర్నేషనల్ స్కూలులో ఉచితంగా చదువు చెప్పించాలని నిర్ణయించుకున్నానని మహేశ్ తెలిపారు. కాగా, సవానీ ఇంటర్నేషనల్ స్కూలులో చదువుతో పాటు పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు కూడా ఉచితంగా కల్పిస్తామని తెలిపారు.
అయితే సవానీ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తల్లిదండ్రులు లేని 472 మంది ఆడ పిల్లలకు అన్నీ తానై వివాహాలు జరిపించారు.