అతివేగంగా కారు నడిపి ఆరుగురి మృతికి కారణమైన కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడు, అరెస్ట్
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా కారు నడిపిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడు ఆరుగురి మృతికి కారణమయ్యాడు. కియా సెల్టోస్ కారు ఆటోను, బైక్ ను వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటన ఆనంద్ జిల్లాలో చోటు చేసుకుంది.
మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన తల్లి కుమార్తెలు ఉన్నారు. రక్షాబంధన్ జరుపుకుని వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలోనే ఆటో డ్రైవర్, బైక్ నడుపుతున్న వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతులంతా సోజిత్ర, బొరియావీ గ్రామాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
ప్రమాదానికి కారణమైన కారు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పూనంభాయ్ పర్కార్ బంధువు కేతన్ పాథియార్ పరుతో రిజిస్టరయ్యింది. కేతన్ పాథియార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పూనంభాయ్ కు సొంత అల్లుడు కావడం గమనార్హం. అతివేగంగా కారు నడిపి ఆరుగురి ప్రాణాలు తీశాడు ఎమ్మెల్యే అల్లుడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేతన్ ను అరెస్ట్ చేశారు. ఘటన సమయంలో కేతన్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మద్యం మత్తులో ఆరుగురి ప్రాణాలు తీసిన ఎమ్మెల్యే అల్లుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ నిజమైన స్వరూపమంటూ ధ్వజమెత్తారు.